మండలంలోని కలకోవలో అనుమతి లేకుండా వివాదస్పదంగా మారిన నాలుగు బోర్లను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు
కలకోవ(మునగాల): మండలంలోని కలకోవలో అనుమతి లేకుండా వివాదస్పదంగా మారిన నాలుగు బోర్లను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. తహసీల్దార్ ఎల్.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వాల్టా చట్టానికి వ్యతిరేకంగా గ్రామానికి చెందిన ఓ రైతు అనుమతి లేకుండా బోర్లు వేశాడని గ్రామానికి చెందిన ఓ మాజీ విశ్రాంత ఉద్యోగి తహసీల్దాకు గతంలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్కు ఓ నివేదిక అందచేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతి లేని బోర్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం తహసీల్దార్ ఎల్.భద్రయ్య తన సిబ్బందితో సహా గ్రామానిక చేరుకోవడంతో బోర్ల యజమానితో పాటు పలువురు గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. తిరిగి మంగళవారం గ్రామానికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీసుల సాయంతో ఎట్టకేలకు బోర్లను సీజ్ చేశారు. అంతే కాకుండా విద్యుత్ శాఖ ఏఈ సదరు బోర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను కూడా తొలగించారు. దీంతో బోర్ల వివాదం సమసిపోయంది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ స్వప్న, వీఆర్వోలు అస్మా సుల్తానా, సురేష్, నరేష్, భిక్షంలు పాల్గొన్నారు.