యుద్ధ ప్రాతిపదికన ‘మిషన్‌ భగీరథ’ పూర్తి | War footing ' mission bhagiratha ' complete | Sakshi
Sakshi News home page

యుద్ధ ప్రాతిపదికన ‘మిషన్‌ భగీరథ’ పూర్తి

Jul 20 2016 8:42 PM | Updated on Sep 4 2017 5:29 AM

యుద్ధ ప్రాతిపదికన ‘మిషన్‌ భగీరథ’ పూర్తి

యుద్ధ ప్రాతిపదికన ‘మిషన్‌ భగీరథ’ పూర్తి

‘మిషన్‌ భగీరథ’ పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేయాలని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అధికారులను ఆదేశించారు.

  • నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
  • అధికారులకు కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ఆదేశం
  • గజ్వేల్‌లో సమీక్ష సమావేశం
  • గజ్వేల్‌: ‘మిషన్‌ భగీరథ’ పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేయాలని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం గజ్వేల్‌లోని ‘గడా’ కార్యాలయంలో ‘మిషన్‌ భగీరథ’ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బి.సురేందర్‌రెడ్డితో కలిసి ఆ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులతోపాటు ఆర్‌అండ్‌బీ అధికారులతో గజ్వేల్‌లో జరుగుతున్న ‘మిషన్‌ భగీరథ’, రోడ్డు పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఆగస్టు 7లోగా పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి గజ్వేల్‌లో రెండు కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులు మూడు నెలలుగా పూర్తి చేయకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేశారు.

    వాటర్‌గ్రిడ్‌ పైప్‌లైన్ల నిర్మాణం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పైప్‌లైన్ల నిర్మాణం వెంటనే పూర్తి చేసి రోడ్డు పనుల విస్తరణకు సహకరించాలని వాటర్‌గ్రిడ్‌ అధికారులకు సూచించారు. రెండు శాఖల మధ్య మున్ముందు ఇలాంటి సమన్వయం లోపం రాకూడదన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 12 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

    అవసరమైతే పనులను వేరే కాంట్రాక్టర్లకు అప్పగించి సత్వరం పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పనులను వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, మిషన్‌ భగీరథ సీఈ కపాకర్‌రెడ్డి, ఎస్‌ఈ విజయప్రకాశ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ చక్రవర్తి, గజ్వేల్‌ మిషన్‌ భగీరథ ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement