
జన్మభూమిలో టీడీపీ నాయకుల దౌర్జన్యం
జన్మభూమి గ్రామ సభల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారు.
నియోజకవర్గ తెలుగు దేశం ఇన్చార్జీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరుగుతుండటం..టీడీపీ నేతల హడావుడి ఎక్కువగా ఉండటం గమానార్హం. పాణ్యం నియోజకవర్గంలో పాఠశాలల్లో జన్మభూమి గ్రామ సభలు నిర్వహిస్తుండటంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోంది. ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిని పొదుపు మహిళలు చుట్టుముట్టి.. తమకు పెట్టుబడి నిధి కింద ఒక్క రూపాయి కూడ రాలేదని ధ్వజమెత్తారు. బేతంచెర్ల, పాణ్యం, ఆళ్లగడ్డ, పత్తికొంద, ఆదోని తదితర ప్రాంతాల్లో ప్రజాసమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం నేమకల్లో జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ప్రస్తావించిన సమస్యలకు ఇంత వరకు దిక్కులేకుండా పోయిందని నిలదీశారు. గ్రామస్థుల ప్రశ్నలకు సమాధనం చెప్పలేక అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించకుండా వెళ్లిపోయారు. మూడో రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది.