వెండి ఆలంకరణలో పూజలందుకుంటున్న ఈరన్నస్వామి
శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం ఉరుకుంద ఈరన్న ఆలయం భక్తులతో పోటెత్తింది.
– ఆలయంలో పోటెత్తిన భక్తులు
– ఈరన్నకు ప్రత్యేక పూజలు
కౌతాళం: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం ఉరుకుంద ఈరన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆదివారం నుంచే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఈ రద్దీ సోమవారం పెరిగి..స్వామి దర్శనానికి గంటల కొద్ది సమయం పట్టింది. మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామతాభిషేకం తదితర ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రద్దీకి అనుగుణంగా అతిశీఘ్ర దర్శనంతో పాటు ప్రత్యేక, శీఘ్ర, ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు.
స్వామి సన్నిధిలో పంచాయతీరాజ్ కమిషనర్
ఉరుకుంద ఈరన్న స్వామిని సోమవారం తెల్లవారుజామున పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, ఈవో మల్లికార్జున ప్రసాద్లు స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలను చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తమ ఇంటి దైవం ఈరన్న స్వామిని ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో దర్శించుకుంటామన్నారు.