సింగరేణిలో సమ్మె మేఘాలు | samme sairan in singareni | Sakshi
Sakshi News home page

సింగరేణిలో సమ్మె మేఘాలు

Aug 25 2016 5:06 PM | Updated on Sep 2 2018 4:16 PM

సింగరేణిలో సమ్మె మేఘాలు - Sakshi

సింగరేణిలో సమ్మె మేఘాలు

సింగరేణిలో చాలా రోజుల తర్వాత ఒక రోజు సమ్మె జరగనున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు తోడు బొగ్గు పరిశ్రమలో ఎదరవుతున్న సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2న సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆగస్టు 8న జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్‌ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలైన టీఎన్‌టీయూసీ, ఇప్టూలోని రెండు వర్గాల నాయకులు హైదరాబాద్‌లో సీఎండీ

  • సెప్టెంబర్‌ 2న విజయవంతం చేసేందుకు సంఘాల ప్రయత్నం
  •  గోదావరిఖని : సింగరేణిలో చాలా రోజుల తర్వాత ఒక రోజు సమ్మె జరగనున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు తోడు బొగ్గు పరిశ్రమలో ఎదరవుతున్న సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2న సమ్మెకు పిలుపునిచ్చాయి.  ఆగస్టు 8న జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్‌ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలైన టీఎన్‌టీయూసీ, ఇప్టూలోని రెండు వర్గాల నాయకులు హైదరాబాద్‌లో సీఎండీకి సమ్మె నోటీస్‌ను అందజేశారు. కాగా సింగరేణిలో ప్రధాన సమస్యలైన వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, 10వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి సత్వరమే ఒప్పందం పూర్తి చేయాలని, సింగరేణి లాభాలపై 30 శాతం స్పెషల్‌ ఇన్సెంటివ్‌ను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణను నిలిపివేయాలని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్నాయి. నిత్యావసర ధరలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను మార్చాలని, పెన్షన్‌ 40 శాతం పెంచాలని, గ్రాట్యూటీపై సీలింగ్‌ను ఎత్తివేయాలని, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, డిస్మిస్‌ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సింగరేణిలో ఐదు గనులలో బొగ్గును వెలికితీసేందుకు ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించే గ్లోబల్‌ టెండర్లను రద్దు చేసి వాటిని సింగరేణి నిర్వహించాలని, 1997 నుండి 2001 వరకు వీఆర్‌ఎస్‌ తీసుకున్న వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సమ్మె డిమాండ్లలో పొందుపర్చారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, జేబీసీసీలో జరిగిన ఒప్పందం మేరకు హైపవర్‌ కమిటి వేతనాలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రత్యేక వీఆర్‌ఎస్‌ను అమలు చేయాలన్నారు. సింగరేణిలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న అత్యవసర సిబ్బందికి కూడా సమ్మె వేతనాలు చెల్లించాలని కూడా నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. గనులపై సమావేశాలు నిర్వహించి సెప్టెంబర్‌ 2న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో గని కార్మికులు పాల్గొనాలని కోరేందుకు జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకెఎస్‌ కూడా సెప్టెంబర్‌ 2 సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె వల్ల సింగరేణిలో దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని, ఈ విషయంలో కార్మిక సంఘాలు, కార్మికులు ఆలోచించాలని యాజమాన్యం కోరుతుండడం గమనార్హం.
     

Advertisement
 
Advertisement
Advertisement