జిల్లాలో ఆరు రోడ్ల అభివృద్ధికి రూ.74 కోట్లు | Rs.74 crores for roads development | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఆరు రోడ్ల అభివృద్ధికి రూ.74 కోట్లు

Oct 6 2016 9:12 PM | Updated on Aug 30 2018 4:51 PM

జిల్లాలో 6 రోడ్లు అభివృద్ధి చేసేందుకు సీఆర్‌ఎఫ్‌ కింద రూ.74 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో 6 రోడ్లు అభివృద్ధి చేసేందుకు సెంట్రల్‌ రోడ్డు ఫండ్‌ (సీఆర్‌ఎఫ్‌) కింద రూ. 74కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఒక్కో దానిలో ఒక్కో రోడ్డు చొప్పున మొత్తం ఆరు రోడ్లను వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు 64 కి.మీ మేరకు పనులు చేపట్టేందుకు 2016-17 సంవత్సరంలో సీఆర్‌ఎఫ్‌ రెండో విడత కింద రూ .74 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి మైతాభ్‌ఖాన్‌గూడ వరకు రోడ్డు వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు 10 కి.మీ.లకుగాను రూ.12 కోట్లు. సిద్దిపేట నియోజకవర్గంలోని తోమాల నుండి నారాయణరావు పేట వరకు 12 కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఒంటి మామిడి-బండమైలారం మధ్య రోడ్డు వెడల్పు, మెరుగు పర్చేందుకు, మూడు హైలెవల్‌ బ్రిడ్జ్‌లను నిర్మించేందుకు రూ. 9 కోట్లు, నర్సాపూర్‌ నియోజక వర్గంలోని చిన్న గొట్టిముక్కుల నుంచి జీడిపల్లి వరకు 16 కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగుపర్చేందుకు రూ.20 కోట్లు, దుబ్బాక నియోజకవర్గంలో  సిద్దిపేట రోడ్డు నుంచి పులిమామిడి వరకు 10.60కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగుర్చేందుకు రూ.11 కోట్లు, పటాన్‌చెరు నియోజకవర్గంలోని గద్దపోతారం నుండి బొల్లారం వరకు 12 కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు రూ. 12 కోట్లు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు.

వివిధ సందర్భాల్లో పర్యటనలకు వెళ్లినపుడు అందిన అభ్యర్థనల మేరకు రోడ్డు పనుల అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు త్వరలోనే పనులు చేపట్టేందుకు ççతగిన సూచనలు జారీ చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement