డిగ్రీ చదివిన ఓ యువకుడు కానిస్టేబుల్ కావాలని కలలు కన్నాడు.
కాటేసిన పేదరికం
Dec 29 2016 11:50 PM | Updated on Sep 17 2018 6:26 PM
- కూలీకి వెళ్లి విద్యుదాఘాతానికి బలైన నిరుద్యోగి
- కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమవుతుండగా ఘటన
- ఇటీవలే వివాహనం కూడా నిశ్చయం
- ఒక్కగానొక్క కొడుకు మృతితో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
డిగ్రీ చదివిన ఓ యువకుడు కానిస్టేబుల్ కావాలని కలలు కన్నాడు. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ప్రాథమిక పరీక్షలూ పాసయ్యాడు. మెయిన్ పరీక్షకు సిద్ధమవుతుండగానే తల్లిదండ్రులు పెళ్లి కూడా ఖరారు చేసేశారు. వచ్చే ఏడాది ఈ సమయానికంతా ఉద్యోగం సాధించి ఓ ఇంటి వాడైతే చూడాలని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అంతలోనే ఉపద్రవం. పేదరికం కారణంగా కూలికి వెళ్లిన కొడుకు విద్యుదాఘాతంతో మృతిచెండంతో గుండెలవిసేలా రోదించారు.
- పాములపాడు
మండల కేంద్రానికి చెందిన అబ్దుల్లా, ఉసేన్మీ దంపతుల కుమారుడు జాకీర్బాషా(22) డిగ్రీ వరకు చదువుకున్నాడు. కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతూ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అప్పుడప్పుడు కూలీపనులకు వెళ్తూ తల్లిదండ్రులకు సాయం సహాయకారిగా ఉండేవాడు. అందులోభాగంగానే గురువారం నాగరాజుకు చెందిన రేకులషెడ్డు ఏర్పాటు పనులకు వెళ్లాడు. పైకప్పునకు రేకులు ఏర్పాటు చేస్తుండగా పైనే ఉన్నకరెంటు తీగలు ప్రమాదవశాత్తూ తగిలి కింద పడ్డాడు. తోటి కూలీలు వెంటనే స్థానిక ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం ఆత్మకూరుకు తరలించారు. కాగా మార్గమధ్యలోనే మృత్యుడికి చేరాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకరరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement