ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో.. | Mentally Handicapped woman Became pregnant | Sakshi
Sakshi News home page

ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో..

Jun 7 2016 9:36 PM | Updated on Oct 16 2018 4:50 PM

ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో.. - Sakshi

ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో..

ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో.. ఏ మృగాడి కామవాంఛకు బలి పశువుగా మారిందో.. తెలియదు..

= మృత ఆడశిశువుకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ
 = రోడ్డు పక్కన వదిలి వెళ్లిన వృద్ధురాలు
 = మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు

 
ప్రకాశం జిల్లా : ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో.. ఏ మృగాడి కామవాంఛకు బలి పశువుగా మారిందో.. తెలియదు..కానీ ఓ మతి స్థిమితం లేని మహిళ గర్భం దాల్చింది. నడిబజారులో నిస్సహాయస్థితిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న మహిళను గుర్తు తెలియని వృద్ధురాలు చూసింది. మానవత్వంతో సమీపంలోని వైద్యశాలకు చేర్చింది. ఆస్పత్రిలో ఆ అభాగ్యురాలు మృత శిశువుకు జన్మనిచ్చింది. మహిళకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును రోడ్డు పక్కన వొదిలేసి వెళ్లింది. ఈ సంఘటన యర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది.
 
 ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ (కోట్ల ఎస్తేరు) కొద్దిరోజుల క్రితం యర్రగొండపాలెం చేరింది. అప్పటి నుంచి పట్టణంలో యాచన చేస్తూ జీవిస్తోంది. ఎస్తేరుకు నెలలు నిండటంతో వృద్ధురాలి సాయంతో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరింది. అర్ధరాత్రి సమయంలో నొప్పులు రావడంతో డ్యూటీలో ఉన్న నర్స్, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌కు సమాచారం అందించారు. బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్ చంద్రశేఖర్ వైద్యసహాయం అందించారు. దీంతో తల్లి మృతశిశువు(ఆడ)కు జన్మనిచ్చి తాను ప్రాణాపాయం నుంచి బయటపడింది.
 
  ఎస్తేరుకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన వొదిలి వెళ్లింది. సోమవారం ఉదయం రోడ్డు పక్కన పడి ఉన్న మృతశిశువును గమనించిన కొందరు ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఎస్సై ఆదేశాల మేరకు ఏఎస్సై షేక్ రఫీ ఉద్దీన్ శువును పరిశీలించారు. అనంతరం వైద్యశాలలోనే ఉన్న ఎస్తేరు ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడంతో వైద్యాధికారి చంద్రశేఖర్‌ను విచారించారు. అనంతరం కొంత సమయం వేచి చూసిన పోలీసులు, మహిళ తరుపు బంధువులు ఎవరూ రాక పోవడంతో మృతశిశువును ఖననం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement