ఎంతపని చేశావయ్యా దేవుడా..

ఎంతపని చేశావయ్యా దేవుడా..


- లారీ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

- మిన్నంటిన ఆర్తనాదాలు




పండుగ సరుకులు తెస్తానంటివి.. అంతలోనే మా నుంచి దూరమైపోయావా! ఎంత పని చేశావయ్యా దేవుడా... అనే రోదనలతో ఆ ప్రాంతం దద్దరల్లింది. ఐదు దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న భర్త.. విగతజీవుడై పడి ఉండగా ఇల్లాలి వేదనకు అంతులేకుండా పోయింది. మలి సంధ్యలో తనకు తోడు లేకుండా పోయాడన్న వేదన ఆమెను కలిచి వేసింది.

- ఓడీ చెరువు:



ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్‌ క్రాసింగ్‌ వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నందివారిపల్లికి చెందిన బైముతక రంగప్ప( 65) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వినాయక చవితి పండుగకు కావాల్సిన సరుకులు తీసుకువచ్చేందుకు స్కూటర్‌పై వెళ్లిన అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా మహమ్మదాబాద్‌ క్రాసింగ్‌ సమీపంలోని బ్రిడ్జ్‌ వద్దకు చేరుకోగానే  ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఘటనలో లారీ కిందకు స్కూటర్‌ వెళ్లిపోయింది. వెనుక చక్రాలు రంగప్ప తలపై నుంచి దూసుకెళ్లాయి.



తల నుజ్జునుజైంది. కుడి భుజం, చేయి నలిగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపి పారిపోయాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నాన్నా మా అందర్నీ వదలిపోతివా కుమారుడు, కుమార్తె రోదనలు స్థానికులను కలిచివేశాయి,. మృతుడి భార్య గంగులమ్మ రోదిస్తూ.. స్పృహ కోల్పోయారు. ఘటన స్థలాన్ని అమడగూరు ఎస్‌ఐ చలపతి, హెడ్‌కానిస్టేబుల్‌ నాగభూషణం పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top