అందుకే గోదావరి ఎడారిలా మారింది | indrakaran reddy takes on karnataka and maharashtra govts | Sakshi
Sakshi News home page

అందుకే గోదావరి ఎడారిలా మారింది

Aug 26 2015 8:09 PM | Updated on Sep 3 2017 8:10 AM

కర్ణాటక, మహరాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణంతో ఎగువ నుంచి నీటి ప్రవాహం లేక తెలంగాణలోని గోదావరి నది ఎడారిగా మారిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ : కర్ణాటక, మహరాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణంతో ఎగువ నుంచి నీటి ప్రవాహం లేక తెలంగాణలోని గోదావరి నది ఎడారిగా మారిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహరాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు... కర్ణాటకలోని 30 అక్రమ చెక్‌డ్యాంలతో సింగూరు జలాశయం, నిజాంసాగర్ ప్రాజెక్టు వట్టిపోయాయన్నారు. బుధవారం నిజాంసాగర్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి  విలేకరులతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను ముఖ్యమంత్రి కేసీఆర్ గూగుల్ సెర్చ్ ద్వారా వీక్షించారని చెప్పారు.

తెలంగాణలోని 10 జిల్లాల రైతులు, ప్రజల భవిష్యత్తు అవసరాల దృష్ట్య్టా సీఎం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులను అనుసంధానం చేస్తూ కాళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకంతో ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు గోదావరి నీరు అందిస్తామని, అలాగే అదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద చెక్‌డ్యాం నిర్మించి సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని వివరించారు.

మిడ్‌మానేరు, ఎల్లంపల్లి నుంచి కామారెడ్డి నియోజకవర్గానికి గోదావరి నీళ్లు తెస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పనుల ప్రణాళికలు 10 రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తీసుకొస్తే నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలకు సాగు నీరందుతుందన్నారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తామని ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement