పెసలు @ రూ.5,225 | Green gram @ Rs.5,225 | Sakshi
Sakshi News home page

పెసలు @ రూ.5,225

Sep 13 2016 11:58 PM | Updated on Sep 4 2017 1:21 PM

పెసలు @ రూ.5,225

పెసలు @ రూ.5,225

నాణ్యమైన పెసలకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. క్వింటాకు రూ.5,225 చొప్పున కొనుగోలు చేయనుంది. దీంతో మార్క్‌ఫెడ్‌ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందు రంగం సిద్ధం చేసింది.

  • మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు
  • ఖమ్మం వ్యవసాయం : నాణ్యమైన పెసలకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. క్వింటాకు రూ.5,225 చొప్పున కొనుగోలు చేయనుంది. దీంతో మార్క్‌ఫెడ్‌ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందు రంగం సిద్ధం చేసింది. ‘పత్తి వద్దు పప్పు దినుసులు ముద్దు’ అనే నినాదంతో ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నినాదానికి బాగా ప్రాధాన్యం ఇచ్చింది. వేసవిలో ఖరీఫ్‌ పంటల సాగుపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ–మన వ్యవసాయం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పత్తి పంటల స్థానంలో పప్పు పంటలు వేయాలని వ్యవసాయ శాఖ ప్రచారం, అవగాహన కల్పించింది. దీంతో జిల్లాలో 1,62,970 సాధారణ విస్తీర్ణం ఉన్న పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. పత్తి విస్తీర్ణం 1,22,572కు పడిపోయింది. దీని స్థానంలో పప్పుదినుసల పంటలైన పెసర, కంది పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. పెసర జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,962 హెక్టార్లు కాగా.. అనూహ్యంగా 27,310 హెక్టార్లు సాగు చేశారు. కంది సాధారణ సాగు విస్తీర్ణం 2,964 హెక్టార్లు కాగా.. 9,420 హెక్టార్లలో వేశారు. కంది సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. జూన్‌లో వేసిన పెసర పంట ఆగస్టు 15 నుంచి ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది ఈ పంట మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,850. అయితే గత రబీ, వేసవిలో పెసల ధర రూ.8వేల వరకు తాకింది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంట ధర ఒక్కసారిగా సగానికి పడిపోయింది. కారణం సాగు విస్తీర్ణం పెరగటంతోపాటు వ్యాపారులు సిండికేట్‌ కావడమే. క్వింటా పెసలను రూ.4వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ప్రభుత్వం మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయటం సరికాదని, ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించాలని నిర్ణయించింది.
    నేటి నుంచి కొనుగోళ్లు
    ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పెసలను మార్క్‌ఫెడ్‌ సంస్థ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. మార్కెట్‌లోని అపరాల యార్డులో పంట ఉత్పత్తిని బుధవారం నుంచి కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ మహేష్‌ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రైతులు మార్కెట్‌కు పంట ఉత్పత్తిని తెచ్చుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
    12 శాతం తేమ కలిగిన సరుకు కొనుగోలు
    పంట కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ సంస్థ పలు నిబంధనలు రూపొందించింది. సరుకులో నిర్ణీత తేమ కలిగి ఉండి, సరుకు ఆరబెట్టి ఉండాలి. మట్టి, రాయి, చెత్తాచెదారం లేకుండా ఉండాలి. సరుకు 12 శాతం తేమను మించి ఉండొద్దు. కాగా.. రైతు పంట సాగు చేసినట్లు స్థానిక గ్రామ రెవెన్యూ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. రైతు వెంట ఆధార్‌ కార్డు , పట్టాదారు పాస్‌ పుస్తకం ప్రతులు ఉండాలి. బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌ పుస్తకం కూడా వెంట తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.
    13సీకెఎం263 : పెసల రాశి

Advertisement

పోల్

Advertisement