
నేతల చుట్టూ ‘సేవల’ ఉచ్చు!
హైదరాబాద్ కేంద్రంగా వాణిజ్య వ్యవహారాలు సాగిస్తున్న నేతలపై కేంద్రం ఆధీనంలోని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం కన్నేసింది.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా వాణిజ్య వ్యవహారాలు సాగిస్తున్న నేతలపై కేంద్రం ఆధీనంలోని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం కన్నేసింది. వీరి ఎన్నికల అఫిడవిట్లు అధ్యయనం చేసిన అధికారులు భారీ స్థాయిలో లావాదేవీల్ని గుర్తించారు. దీంతో లెక్కలు చెప్పాల్సిందిగా కోరుతూ. దాదాపు 40 మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు లేఖలు రాశారు. ఈ నేతల్లో మంత్రులు, మాజీ మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఉండటం గమనార్హం. వారి నుంచి వచ్చే సమాధానాల ఆధారంగా అవసరమైనచర్యలు తీసుకోవడానికి సర్వీస్ ట్యాక్స్ విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవన్నీ సేవలపన్ను పరిధిలోకి...
వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్ళు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్్స దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి.
ఆర్థిక చట్ట ప్రకారం ఇలాంటి వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు సాగించే వారు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆధీనంలోని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. వీరు సర్వీస్ ట్యాక్స్ విభాగం దగ్గర రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు వార్షిక రిటర్న్్స దాఖలు చేస్తూ, సర్వీసు ట్యాక్స్ మొత్తాన్ని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించాలి. ప్రస్తుతం ఈ సర్వీసు ట్యాక్స్ సెస్లతో కలిసి 15 శాతంగా ఉంది.
వారి గుట్లు విప్పిన అఫిడవిట్లు...
నగరం కేంద్రంగా ఇలాంటి వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు సాగిస్తున్న అనేక మంది రాజకీయ నాయకులు తమకు సక్రమంగా పన్ను చెల్లించట్లేదని, కొందరైతే కనీసం రిజిస్ట్రేషన్ సైతం చేయించుకోలేదని సర్వీస్ ట్యాక్స్ విభాగం ఎప్పటి నుంచో అనుమానిస్తోంది. ఆ అధికారులకు 2014 సాధారణ ఎన్నికల అఫిడవిట్లు కీలక ఆధారాలను అందించాయి. అప్పటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో అఫిడవిట్లనూ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
వీటిలో కుటుంబం, పిల్లలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు తమకు ఉన్న ఆస్తులు, తమపై ఉన్న కేసుల వివరాలనూ సమగ్రంగా పొందుపరుస్తారు. ఈ అఫిడవిట్లన్నీ మైనేత.ఇన్ఫో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని సేకరించిన సర్వీస్ ట్యాక్స్ అధికారులు సమగ్రంగా అధ్యయనం చేశారు.
లేఖలు రాసిన సేవలపన్ను అధికారులు...
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు సాగిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 మంది నేతల గుట్టు ఎన్నికల అఫిడవిట్లు ద్వారా అధికారులు సేకరించారు. వీరిలో మంత్రులు, మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీ పడిన వారు సైతం ఉన్నారు. కొందరు తమ పేర్లతోనే వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు సాగిస్తుండగా... మరికొందరు కుటుంబీకుల పేర్లతో చేస్తున్నారని వెల్లడైంది. ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థల చిరునామాలు, విలువలతో సహా వీటిలో దొరికాయి. దీంతో వీరందరి నుంచి లెక్కలు కోరుతూ సర్వీస్ట్యాక్స్ విభాగం లేఖలు రాసింది.
ఇప్పటికే కొందరు స్పందించి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఆయా చిట్టాలు, వాటి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సర్వీస్ ట్యాక్స్ కట్టాలా? ఎంత కట్టాలి? అనేవి నిర్థారించనున్నారు. ఆపై నోటీసుల జారీ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా నేతలకు, వారి కుటుంబీకులకు నోటీసులు ఇచ్చిన తర్వాత గడువులోపు సర్వీసు ట్యాక్స్ చెల్లించకపోతే బకాయిపడ్డ మొత్తానికి 100 శాతం జరిమానా, ఏడాదికి 30 శాతం వడ్డీతో వసూలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్–బెయిలబుల్ వారెంట్ తీసుకుని నేరుగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించే అవకాశం సైతం ఉందని అధికారులు చెబుతున్నారు.