చక్రతీర్థంలో బంగారు బల్లి | golden Lizard in chakrateertham | Sakshi
Sakshi News home page

చక్రతీర్థంలో బంగారు బల్లి

Mar 8 2016 2:59 AM | Updated on Sep 3 2017 7:12 PM

చక్రతీర్థంలో బంగారు బల్లి

చక్రతీర్థంలో బంగారు బల్లి

బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది.

సాక్షి, తిరుమల: బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటిది నిజమైన బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో మాత్రమే కలుగుతుంది. అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారు బల్లి అంతరించే జాతుల్లో చేరింది. ఇలాంటివి కొన్నేళ్లుగా కనిపించడం లేదు. అయితే సోమవారం మహాశివరాత్రి పర్వదినాన ఈ బంగారు బల్లి ఆదివారం శేషాచలం ఏడుకొండల్లో దర్శనమిచ్చింది. తిరుమల చక్రతీర్థం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభ సమయంలో బంగారు బల్లి కనిపించింది. భారీ కొండల మధ్య వచ్చిన చీలికల నుంచి ఏటవాలుగా ధగధగ మెరిసే బంగారు వర్ణంతో భక్తులకు దర్శనమిచ్చింది.

 రాతి గుహలే ఆవాసం
 బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది. ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి. అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి. శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement