రాత్రి 7.30కి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం | EAMCET counseling Polytechnic colleges | Sakshi
Sakshi News home page

రాత్రి 7.30కి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

Jun 7 2016 4:36 AM | Updated on Sep 17 2018 7:38 PM

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం, అధికారులు ప్రకటనలు గుప్పించినా విద్యార్థులకు మాత్రం అవస్థలు తప్పలేదు.

నర్సీపట్నం:  ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం, అధికారులు ప్రకటనలు గుప్పించినా  విద్యార్థులకు మాత్రం అవస్థలు తప్పలేదు. ప్రభుత్వ నిర్దేశించిన 9 గంటల సమయానికి విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌లో సైట్ ఎంతకీ ఓపెన్ కాలేదు.  పది గంటలకు ఓపెన్ అవుతుందని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ రావడంతో కౌన్సెలింగ్ సిబ్బంది కంప్యూటర్ల ముందు వేచి చేశారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం నుండి పడిగాపులు పడ్డారు.

ఇక ఓపిక నశించి చాలా మంది ఇంటి ముఖం పడుతున్న తరుణంలో   రాత్రి 7 గంటల తరువాత సైట్ ఓపెన్ అయింది. అధికారులు హడావుడిగా కౌన్సెలింగ్ ప్రారంభించారు. 1 నుండి 5 వేల  ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉన్నా   15 మంది  మాత్రమే నమోదు చేసుకోగలిగారు.  దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు అవస్థలు పడ్డారు. పట్టణానికి దూరంగా ఉండటం వలన భోజనం చేయడానికి కూడా వీలేకుండా పోయింది.   

మొదటి రోజు కౌన్సెలింగ్ నిర్వహించడంలో అధికారులు విఫలం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ రామచంద్రరావు మాట్లాడుతూ  సర్వర్‌లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తిందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement