‘అనాథాశ్రమాన్ని పోలీస్‌కమిషనరేట్‌గా మార్చొద్దు’ | Sakshi
Sakshi News home page

‘అనాథాశ్రమాన్ని పోలీస్‌కమిషనరేట్‌గా మార్చొద్దు’

Published Tue, Jul 26 2016 6:16 PM

do not change Orphanage in to  Police Commissionerate

ఎన్నో ఏళ్లుగా ఆనాథలకు నీడ నిస్తున్న సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ అనాథ గృహాన్ని పోలీసు కమిషనరేట్‌గా మార్చాలన్న ఆలోచనను విరమించుకోవాలని బాలలహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధారావు పేర్కొన్నారు. నైజాం హయాంలో ఖానాగా పిలువబడే ఈ విక్టోరియా మెమోరియల్ సంస్థను అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ సందర్శించారని తెలిపారు.

 

కోల్‌కతాలో ఉన్న విక్టోరియా మహల్ రూపంలో ఈ నిర్మాణం ఉండాలని ఆకాంక్షించిన ఆయన ప్రస్తుతం విక్టోరియా మెమోరియల్ హోంను నిర్మించి పిల్లలకు చెందేలా నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. విక్టోరియా మెమోరియల్ హోంలో మొత్తం 94ఎకరాలు ఉండగా మధ్యలో రహదారివెళ్లడం, మరి కొంత స్థలం అన్యాక్రాంతం కావడం, మరి కొంత స్థలం ప్రభుత్వాలే ప్రైై వేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంతో కేవలం 64ఎకరాల స్థలం మిగిలిందని ఆమె వివరించారు.

 

దీనిని కూడా పిల్లలకు దక్కకుండా చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు ఇవ్వచూపడంపై బాలల హక్కుల సంఘం తరఫున తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ హోమ్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకే చెందాలని... ప్రభుత్వం కమిషనరేట్‌కు ఇవ్వాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఆందోళన చేపడుతామని ఆమె హెచ్చరించారు.

Advertisement
Advertisement