రణరంగం
యనమలకుదురులో పలు గ్రూప్హౌస్లను అక్రమంగా నిర్మించారని, వాటిని కూల్చేయాల్సిందేనని శుక్రవారం సీఆర్డీఏ అధికారులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
యనమలకుదురు గ్రామంలో కొండ వెనుక ప్రాంతంలో కట్టడాల కూల్చివేత రణరంగమైంది. పోలీసులు, సీఆర్డీఏ అధికారులతో భవన యజమానులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఒకదశలో అధికారులు, పోలీసులతో తోపులాటలతో రణరంగాన్ని తలపించింది.
యనమలకుదురు (పెనమలూరు): యనమలకుదురులో పలు గ్రూప్హౌస్లను అక్రమంగా నిర్మించారని, వాటిని కూల్చేయాల్సిందేనని శుక్రవారం సీఆర్డీఏ అధికారులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భవనాలను ధ్వంసం చేయవద్దని పలువురు ప్రాధేయపడ్డారు. తమకు వారం రోజులు గడువు ఇస్తే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకుంటామని కోరారు. అయితే సీఆర్డీఏ అధికారులు ససేమిరా అన్నారు.
వివాదం ఇలా మొదలైందిలా
వరుసగా మూడవరోజు కూల్చివేతకు ప్రజల నుంచి తీవ్ర పతిఘటన ఎదురైంది. తొలుత చందూ అనే బిల్డర్ భవనం స్లాబ్ కూల్చడానికి సీఆర్డీయే అధికారులు రాగా స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేనే ఈ పని చేయిస్తున్నాడని తీవ్రంగా ఆరోపణలు చేశారు. పోలీస్ బందోబస్తుతో ఆ భవనం స్లాబ్కు కన్నాలు పెట్టారు. అలాగే రామరాజు అనే బిల్డర్ భవనం పై రెండు అంతస్తులు తొగించటానికి రాగా అప్పటికే దాదాపు 200 మంది భవనం మందు బైఠాయించి ఉన్నారు. వారిని లోపలకు వెళ్లనీయలేదు. భవనం లోనికి అడుగుపెడితే చనిపోతానని బిల్డర్ సోదరుడు సీతారామరాజు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
పరుగులు తీయించిన పోలీసులు
ఈ సమాచారం తెలుసుకున్న సెంట్రల్ ఏసీపీ సత్యానందం, పటమట సీఐ దామోదర్ భారీగా సిబ్బందితో వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు కన్వీనర్ బొప్పన భవకుమార్ వచ్చి భవనాలు కూల్చవద్దని అధికారులను కోరారు. అన్ని గ్రామాల్లో ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయని, అవకాశం ఇస్తే రెగ్యులర్ చేయించుకుంటారని తెలిపారు. తమకు ఉన్న ఆదేశాలమరకు అక్రమ కట్టడాలు కూల్చుతున్నామని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. భవకుమార్తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. గ్రామస్తులను లాఠీలతో పరుగులు తీయించారు. సీఆర్డీ అధికారులు భవనంలోకి వెళ్లి భవనం స్లాబ్లు పగులకొట్టించారు.
టీడీపీ ఆదేశాలతోనే విధ్వంసం
– భవకుమార్ ఆరోపణ
భవనాలను సీఆర్డీఏ అధికారులు ధ్వంసం చేయటం దారుణమని భవకుమార్ ఖండించారు. బిల్డర్లు గ్రామాభివృద్దికి నిధులు ఇచ్చినా అధికారులు కఠినంగా వ్యవహరించటం తగదన్నారు. నిర్మించేటప్పడు అధికారులు మౌనంగా ఉండి, ఇప్పుడు టీడీపీ నేతలు చెబితే భవనాలు ధ్వంసం చేయటం దుర్మార్గమని ఆరోపించారు. పోలీసులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేయటం తగదన్నారు.