
ప్రజలు మెచ్చే పనులే చేస్తాం
తూతూ మంత్రంగా కాకుండా నాణ్యతతో ప్రజలు మెచ్చే విధంగా పనులు చేసి వారి మన్ననలు పొందాలన్నదే
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి
సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
భీమ్గల్(బాల్కొండ): తూతూ మంత్రంగా కాకుండా నాణ్యతతో ప్రజలు మెచ్చే విధంగా పనులు చేసి వారి మన్ననలు పొందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆయన బాటలోనే తాము నడస్తున్నామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన భీమ్గల్ మండలంలోని చేంగల్లో రూ. 57 లక్షలతో, బడాభీమ్గల్లో రూ. 51.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో ఎంపీ కవితతో కలిసి తాను చేంగల్కు ప్రచారానికి వచ్చినపుడు ఇక్కడి కాలనీలోని రోడ్లు చూసి ఆశ్చర్యపోయామన్నారు.
రోడ్డంతా గుంతలుగుంతలుగా ఉండేదన్నారు. ఆ రోజే తాము నిర్ణయించుకున్నామని ఎనికల్లో గెలిస్తే ఎలాగైనా గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మించాలనుకున్నామని పేర్కొన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో నిధులు మంజూరు చేశామన్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామంలో శిథిలమైన మార్కెట్ యార్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ గోదావరి ప్రకాశ్గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు బాదావత్ లక్ష్మీ శర్మనాయక్, కేఎంసీ చైర్మన్ దొనకంటి నర్సయ్య, కన్వీనర్ గున్వీర్ రెడ్డి, స్థానిక సర్పంచ్లు ఆర్మూర్ మహేశ్, ములుగూరి స్వప్న గణేశ్, ఏశాల కృష్ణ, తాంస రవీందర్, కొమ్ము నరేశ్, బుర్ర దేవేందర్ గౌడ్, జిన్న శోభన్, పుప్పాల రాజేశ్వర్, కోలి బాల్ రెడ్డి, కుమ్మరి బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ పైప్లైన్ పనుల పరిశీలన
మోర్తాడ్(బాల్కొండ): మండలంలోని శెట్పల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను బుధవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపం ఉండకూడదని ఆదేశించారు. పైప్లైన్ ఏర్పాటు నిబంధనల ప్రకారం సాగాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొన్కంటి నర్సయ్య, బాల్కొండ నాయకుడు సామ వెంకట్రెడ్డి, సర్పంచ్ లింబన్న తదితరులు పాల్గొన్నారు.