సిరిమాను సంబరానికి సిద్ధం | Asirithalli Sirimanothsavam today | Sakshi
Sakshi News home page

సిరిమాను సంబరానికి సిద్ధం

May 17 2016 10:13 AM | Updated on Sep 2 2018 4:48 PM

అరసవల్లి అంటే అందరికీ సూర్యనారాయణ స్వామే. ఆ స్వామి ఉత్సవాల తర్వాత ఆ స్థాయిలో అసిరితల్లి ఉత్సవాలు ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్నాయి.

► అరసవల్లిలో నేడు అసిరితల్లి సిరిమానోత్సవం

శ్రీకాకుళం: అరసవల్లి అంటే అందరికీ సూర్యనారాయణ స్వామే. ఆ స్వామి ఉత్సవాల తర్వాత ఆ స్థాయిలో అసిరితల్లి ఉత్సవాలు జిల్లాలో జరుగుతున్నాయి. పన్నెండేళ్లకోమారు నిర్వహించే ఈ ఉత్సవానికి ఇప్పుడు గ్రామమంతా సిద్ధమైంది. మంగళవారం గ్రామంలో అసిరితల్లి సిరిమానోత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామ దేవతకు నిర్వహించే ఈ ఉత్సవానికి ఊరు ఊరంతా వేచి చూస్తోంది.           
 
నెల రోజులుగా అరసవల్లిలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. గ్రామ దేవత అసిరితల్లికి ఉత్సవాలే ఇందుకు కారణం. పుష్కర కాలానికి ఓ సారి నిర్వహించే ఈ ఉత్సవాలను ఈ మారు చాలా ఘనంగా చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఉత్సవంలో అరసవల్లితోపాటు ఖాజీపేట, ఆదిత్యనగర్, తెలుగు ముసలయ్యకాలనీ, కొయ్యాన కన్నయ్య కాలనీ, కామేశ్వరినగర్‌కాలనీ, సాదువారి కాలనీ, లక్ష్మీనగర్‌కాలనీ ప్రజలంతా పాల్గొంటారు. గత నెల 19న మొదలైన ఈ ఉత్సవాలు మంగళవారం జరిగే అనుపు ఉత్సవాలతో ముగియనున్నాయి.

అనుపు పండగ రోజు ఉదయం కోటపోయడం, మాను కట్టుడం సిరి మాను ఉత్సవం చేస్తారు. ఈ సిరిమాను ఉత్సవంలో సిరిమాను తయారు చేసే కుటుంబానికి చెందిన వ్యక్తి, అమ్మవారి ఆలయ దమ్మల పూజారి సిరిమానుపై ఎక్కుతారు. మొదట దుర్గమ్మ మట్టి వద్ద బయలు దేరిన సమయం లో సిరిమాను తయారు చేసే రాయల కుటుం బానికి చెందిన మల్లేశ్వరరావు ఎక్కి నీలమ్మ గుడి వరకు వస్తారు. అక్కడ దమ్మల పూజారైన పిరియా అప్పారావు సిరిమాను ఎక్కుతారు. తిరిగి ఈ సిరిమాను అసిరి తల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లే వరకు ఉంటారు. వందల ఏళ్లుగా ఈ వేడుక ఇక్కడ జరుగుతోంది.

పోలీస్ శాఖ నిబంధనలు
పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సిరిమాను ఉత్సవం పూర్తయ్యే వరకు వాహనా ల రాకపోకలు నిలివేస్తున్నామని సీఐ అప్పల నాయుడు తెలిపారు. 80అడుగుల రోడ్డు వర కు శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలు, గారవైపు నుంచి వచ్చే వాహనాలు అమ్మవారి ఆల యం వరకు ఆగిపోతాయన్నారు. అలాగే బుధవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 100మంది పోలీసు సిబ్బందిని షిఫ్టు డ్యూటీల్లో ఏర్పాటు చేశామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement