
సభ సజావుగా సాగేందుకే బందోబస్తు
ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగేందుకే పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఏసీసీ ఫ్యాక్టరీ, మైనింగ్ కోసం నిర్వహించిన పర్యావరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
– నెరవెర్చే హామీలనే ఫ్యాక్టరీ యాజమాన్యం ఇవ్వాలి
– ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ
జమ్మలమడుగు: ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగేందుకే పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఏసీసీ ఫ్యాక్టరీ, మైనింగ్ కోసం నిర్వహించిన పర్యావరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతుల డిమాండ్లు, వారు అడుగుతున్న నష్టపరిహారంపై కంపెనీ యాజమాన్యం స్పష్టమైన హామీలను రాతపూర్వంగా ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతానికి హామీలిచ్చి తర్వాత ముఖం చాటేస్తే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. కాబట్టి తీర్చగలిగే హామీలను ఇవ్వాలని యాజమాన్యానికి సూచించారు. సీఎస్ఆర్ కింద కేటాయించిన రూ. 35 కోట్లతో పది గ్రామాల ప్రజలతో చర్చించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నష్టపోయిన రైతులకందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
ఫ్లాంట్ పూర్తయితే 10 వేల మందికి ఉపాధి
అనంతరం ఏసీసీ డైరెక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 2700 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఫ్యాక్టరీని రూ. 7200 కోట్లతో నిర్మించనున్నామని.. మొదటి విడతలో 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఫస్ట్ ఫ్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దశలో పూర్తి సామర్ధ్యంతో ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. ఫ్లాంట్ పూర్తయితే 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు.
స్పష్టమైన హామీ ఇవ్వని ఏసీసీ యాజమాన్యం
రైతులకు సంబంధించిన డిమాండ్లపై ఏసీసీ యాజమాన్యం స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో రైతులు నిరాశ చెందారు. 20 ఏళ్ల కిందట మూడేళ్లలో కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తమ దగ్గర భూములు కొనుగోలు చేశారని రైతులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆ మేరకు చర్యలు తీసుకోకుండా ఆర్థికంగా నష్టపోయామని వాపోయారు. తమను మోసం చేసిందని ఏసీసీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు కారుచౌకగా తీసుకున్న భూములకు ఇప్పటి పరిహారాన్ని అందజేయాలని ముక్తకంఠంతో వారంతా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్వేత, ఆర్డీవో వినాయకం, ఏపీ పర్యావరణ కాలుష్య నియంత్రణ ఈఈ నరేంద్ర, ఏసీసీ మైనింగ్ డైరెక్టర్ రాథోడ్, కృష్ణసింగ్, రైతులు పాల్గొన్నారు.