అమెరికాలో తెలుగు జాతి ఐక్యత, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు జాతి ఐక్యత, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారందరినీ చేరుకునేందుకు ‘నాటా నగారా’ పేరిట కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈశాన్య అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో నగారా బృందం పర్యటించింది.
హంట్స్విల్లే, నాష్విల్లే, మెంఫిస్, అట్లాంటా, చార్లెటే, బర్మింగ్హామ్ ప్రధాన నగరాల్లో పర్యటించి సాహిత్య, సంగీత కార్యక్రమాలతో తెలుగు వారిని ఆకర్షించింది. ‘నగారా’లో చేపట్టిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించిందని ‘నాటా’ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. 2014 జూలై 4 నుంచి 6 వరకు అమెరికాలోని అట్లాంటా నగరంలో నిర్వహించనున్న ‘నాటా 2014 కన్వెన్షన్’ తమ ప్రస్థానంలోనే అతిపెద్ద కార్యక్రమంగా నిలవనుందని అన్నారు. దీనికి ప్రచారం కల్పించి తెలుగువారందరినీ చేరుకునేందుకు ఈ నగారా నిర్వహించినట్లు తెలిపారు. ‘నాటా 2014 కన్వెన్షన్’లో దాదాపు 10వేల మంది తెలుగువారు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు.
ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలకు గాయకుడు మురళీకృష్ణ గానంతో నగారాలో తెలుగు సంస్కృతి వైభవాన్ని మనోరంజకంగా చాటిచెప్పామన్నారు. రచయిత చంద్రబోస్ ‘నాటా’ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారని నాటా 2014 కన్వెన్షన్ కన్వీనర్ బాల ఇందుర్తి తెలిపారు. గాయకుడు మురళీకృష్ణకు ‘నవ యువ బాలసుబ్రమణ్యం’, చంద్రబోస్కు ‘స్వభావకవి’ బిరుదులిచ్చి సత్కరించినట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.