టవర్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య 

Young Man Commits Suicide by Jumping from Cell Tower - Sakshi

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఒకవైపు పేదరికం.. మరోవైపు జీవితంలో ఇంకా స్థితపడలేదనే మనోవేదనకు గురైన ఓ యువకుడు మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి ఇంటి సమీపంలోనే ఉన్న సెల్‌ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుంభం గోవర్ధన్‌(22) అనే యువకుడు డిగ్రీలో ఫేయిల్‌ అయిన సబ్జెక్టులను ఇటీవలే రాశాడు.

మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా కుటుంబసభ్యులు బంధువులకు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం సాయంత్రం సెల్‌ టవర్‌ కంపెనీ ప్రతినిధులు టవర్‌ వద్దకు రాగా దుర్వాసన వెదజల్లడంతో లోపలికి వెళ్లి చూసే సరికి  కుల్లిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు.  

వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి ఎస్సై చంద్రశేఖర్‌ చేరుకుని మృతుడి జేబులోని పర్సు,  ఫోన్‌ను పరిశీలించగా కుంభం గోవర్ధన్‌ మృతదేహంగా గుర్తించారు. పేదరికం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపారు.

మృతుడికి తండ్రి చంద్రమౌళి, ఇద్దరు సోదరులున్నారు. సోదరుడు సాయికిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top