పొట్టకూటి కోసం వెళ్లి.. | Workers Died in Bike Accident PSR Nellore | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం వెళ్లి..

Dec 25 2018 1:20 PM | Updated on Dec 25 2018 1:20 PM

Workers Died in Bike Accident PSR Nellore - Sakshi

ఘటనా స్థలంలో మృతదేహాలు

నెల్లూరు, కోవూరు: వారిద్దరూ పొట్టకూటి కోసం ఉదయం నెల్లూరు నగరానికి వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఇంతలో రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుని వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

బేల్దారి పనికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు బేల్దారి కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కోవూరు లారీ యార్డ్‌ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దగదర్తి మండలంలోని అనంతవరం లైన్స్‌నగర్‌కు చెందిన పరశు వెంకటేశ్వర్లు (41), చంద్రమౌళి (40) బేల్దారి కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం ఇద్దరూ పనినిమిత్తం నెల్లూరుకు వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కోవూరు లారీ యార్డ్‌ సమీపంలో జాతీయ రహదారిపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ఢీకొట్టిన వాహనం వారిపై నుంచి వెళ్లింది. హెల్మ్‌ట్‌లు ధరించి ఉన్నా వాహనం వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు పరశు వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి, కోవూరు సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్సై వెంకట్రావు, ట్రైనీ ఎస్సై అనూషలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement