చిన్నారుల కిడ్నాప్‌ కేసులో ఇద్దరు మహిళల అరెస్ట్‌ | Womens Arrest in Kidnap Case Hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారుల కిడ్నాప్‌ కేసులో ఇద్దరు మహిళల అరెస్ట్‌

Apr 20 2019 7:43 AM | Updated on Apr 20 2019 12:15 PM

Womens Arrest in Kidnap Case Hyderabad - Sakshi

నిందితులు మంగ, అనిత

హస్తినాపురం: ఇంటిముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్‌ చేసి రూ.10 వేలకు విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను బాలాపూర్‌ పోలీసులు ఆరు గంటల్లో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ సీఐ సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, కాకర్లపాడుకు చెందిన నర్సింహులు, శోభ దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు లోఖిత(10),శ్రీవాణి(7),సాయిప్రియ(4)లతో కలిసి బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటూ కూలీలుగా పని చేస్తున్నారు.

వీరి ఇంటి సమీపంలో ఉంటున్న మంగ అనే మహిళ నగరంలోని ప్రధాన కూడళ్లలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ ఉంటుంది. సూరారం కాలనీలో ఉంటున్న ఆమె  బంధువు అనితకు పిల్లలు లేకపోవడంతో మంగను సంప్రదించింది. తాను పిల్లలను తీసుకువస్తానని రూ. 10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న మంగ అడ్వాన్స్‌ తీసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి ముందుకు ఆడుకుంటున్న లోఖిత, సాయిప్రియలకు చాక్‌లెట్లు, ఐస్‌క్రీమ్‌ ఇప్పిస్తానని ఆశచూపిన మంగ వారిని ఆటోలో తీసుకుని వెళ్లింది. పిల్లలు కనిపించకపోవడంతో నర్సింహ్మ దంపతులు బాలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మంగపై అనుమానంతో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఉప్పల్‌ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా అనితను అదుపులోకి తీసుకుని వారి నుంచి  ఇద్దరు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement