వస్త్ర దుకాణంలో చోరీ

Women Thief Robbery in Cloth Showroom - Sakshi

రొంపిచర్ల(నరసరావుపేట): వస్త్ర దుకాణంలో కొనుగోలుకు వచ్చిన ఐదుగురు మహిళలు రూ.18 వేల రూపాయల విలువ చేసే వస్త్రాలతో పరారైన సంఘటన మండల కేంద్రంలోని రొంపిచర్ల చెరువుగట్టు సెంటర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. దుకాణం నిర్వాహకురాలు రమణ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. రమణ నిర్వహిస్తున్న క్లాత్‌ రెడీమేడ్‌ వస్త్ర దుకాణానికి మంగళవారం ఐదుగురు గుర్తు తెలియని మహిళలు కొనుగోలు చేసేందుకు వచ్చారు.

వారిలో ఇద్దరు మహిళలు రేట్లు అడుగుతూ నిర్వాహకురాలు రమణను పక్కదోవ పట్టించారు. ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు మహిళలు బయట ఉన్న ఆటోలోకి వస్త్రాలను తరలించారు. బేరం ఆడుతున్న మహిళలు రేట్లు కుదరక పోవటంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వారికి చూపించిన వస్త్రాలు సర్దుకుంటుండగా, కొన్ని తగ్గినట్టు గమనించి బయటకు వచ్చి చూడగా ఆ మహిళలు పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపులో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్‌లలో ఆ మహిళలు దుస్తులు కొనుగోలు చేస్తున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top