భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం  | Sakshi
Sakshi News home page

భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం 

Published Mon, Dec 30 2019 9:21 AM

Woman Killed In Road Accident - Sakshi

కంచిలి: భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం చెందిన ఘటన మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. కవిటి మండలం కాజూరు గ్రామానికి చెందిన బందరు రోజా (46) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త మోహన్‌రావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కాజూరు గ్రామానికి చెందిన బందరు మోహన్‌రావు, భార్య రోజా తమ సామాజిక వర్గానికి చెందిన వనభోజనాలను సోంపేట మండలం ఎకవూరు సముద్రపు తీరం వద్ద ఆదివారం ఏర్పాటు చేయడంతో వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరి కుమారుడు హరీష్‌ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. మోపెడ్‌పై మోహన్‌రావు, రోజా తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. జాడుపూడి కాలనీ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కంటైనర్‌ మోపెడ్‌ హ్యాండిల్‌కు రాసుకొని వెళ్లింది. దీంతో మోపెడ్‌ అదుపుతప్పి భార్యాభర్తలు రోడ్డుపై పడిపోయారు.

రోజా తలపై నుంచి లారీ(కంటైనర్‌) వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మోహన్‌రావు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మోహన్‌రావు హెల్మెట్‌ ధరించడంతో తలకు గాయాలు కాలేదు. కంటైనర్‌ ఆపకుండా వెళ్లిపోవడంతో హైవే పోలీసులు కొజ్జిరి జంక్షన్‌ వద్ద పట్టుకొన్నారు. క్షతగాత్రుడు మోహన్‌రావు కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె ధనలక్షి్మకి వివాహం చేశారు. కుమారుడు హరీష్‌ చదువు పూర్తిచేసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రోజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మోహన్‌రావుకు ఈ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు. మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ సి.హెచ్‌.దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement