పక్కా ప్లాన్‌.. ప్రియుడి భార్య హత్య

Woman Killed By Husband Childhood Sweetheart In Delhi Who Staged Murder As Suicide - Sakshi

న్యూఢిల్లీ : ప్రియుడిని దక్కించుకునేందుకు అతడి భార్యను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో నిందితురాలికి సహకరించిన మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నైరుతి ఢిల్లీలోని కిషన్‌భాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాహుల్‌ కుమార్‌ మిశ్రా(32) అనే ఇంజనీర్‌ భార్య పూజా రాయ్‌తో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 16 తన భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిందంటూ సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే కూతురి ఆకస్మిక మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన పూజ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలో ఆయనతో పాటు మిగతా కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా.. అటాప్సీ రిపోర్టు ప్రకారం పూజది హత్యేనని తేలింది. దీంతో రాహుల్‌ కుమార్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, ఇంటికి తరచుగా వచ్చే వాళ్లపై పోలీసులు నిఘా వేశారు. ఈ క్రమంలో రాహుల్‌ మాజీ ప్రేయసి పద్మా తివారి.. పూజను హతమార్చినట్లు గుర్తించారు. దీంతో బుధవారం పద్మతో పాటుగా రాహుల్‌ను కూడా అరెస్టు చేశారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే..
విచారణలో భాగంగా తమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంగానే పూజను అంతమొందించామని నిందితులిద్దరు అంగీకరించారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ పద్మ, రాహుల్‌ జార్ఖండ్‌లోని సింద్రి ధన్‌బాద్‌లో ఎల్‌కేజీ నుంచి పన్నెండో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు. అయితే ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో వేర్వేరు కాలేజీల్లో చేరడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో 2015లో స్కూల్‌ ఫ్రెండ్స్‌ క్రియేట్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా పాత ప్రేమికులిద్దరు మళ్లీ దగ్గరయ్యారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అడ్డుచెప్పాయి. అనంతరం 2017లో సింద్రీకే చెందిన పూజాతో రాహుల్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో తానొక అమ్మాయిని ప్రేమిస్తున్నాని.. కాబట్టి తనతో పెళ్లి ఇష్టం లేదని చెప్పాల్సిందిగా రాహుల్‌.. పూజను కోరాడు. కానీ ఆమె ఇందుకు తిరస్కరించడంతో ఏప్రిల్‌ 23న వారి పెళ్లి జరిగింది.

అనంతరం రాహుల్‌ ఉద్యోగ రీత్యా ఇద్దరు ఢిల్లీకి వచ్చారు. పెళ్లి తర్వాత కూడా రాహుల్‌-పద్మల మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో హత్య జరిగిన రోజు రాహుల్‌ ఇంటికి వచ్చిన పద్మ.. అతడి స్నేహితురాలినంటూ పూజను పరిచయం చేసుకుంది. బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన అనంతరం మాటల్లో పెట్టి.. పూజను కిందపడేసి ఆమె తలను నేలకేసి కొట్టి గొంతు నులిమింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పూజ పేరిట ఉత్తరం రాసింది. ఇక పూజ హత్య కుట్రలో భాగంగా రాహుల్‌ పనిమనిషికి ముందే సమాచారం ఇవ్వడంతో అతడు కూడా పద్మకు సహకరించాడు. దీంతో నిందితులను అరెస్టు చేశాం’అని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top