పెళ్లయిన నాలుగు రోజులకే నవవధువు మృతి | Woman Died By Current Shock In Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లయిన నాలుగు రోజులకే నవవధువు మృతి

Jan 27 2019 10:08 AM | Updated on Jan 27 2019 1:54 PM

Woman Died By Current Shock In Hyderabad - Sakshi

రాంగోపాల్‌పేట్‌: కాళ్ల పారాణి ఆరలేదు...పెళ్లి తంతూ ఇంకా పూర్తికాలేదు. అంతలోనే ఓ నవ వధువును కరెంటు కాటేసింది. పెళ్లయిన నాలుగు రోజులకే ఆమెకు నూరేళ్లు నిండాయి. హీటర్‌ షాక్‌ కొట్టి నవవధువు మృతి చెందిన సంఘటన మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

సికింద్రాబాద్‌ కళాసీగూడ ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతానికి చెందిన పరమేశ్వర్, షీమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు.  పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం జరిగింది. పరమేశ్వర్‌ మృతి చెందగా, షీమాదేవి కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటోంది. రెండో కుమార్తె మనీషా ఈ నెల 22న నాంపల్లికి చెందిన కృష్ణ శర్మతో వివాహం జరిగింది. సికింద్రాబాద్‌లోని సిక్‌వాలా సమాజ్‌లో ఘనంగా వివాహం జరిపించారు. శుక్రవారం పుట్టింట్లో పగిరిరథం (ఫంక్షన్‌) ఉండటంతో ఆమెను కళాసీగూడకు తీసుకుని వచ్చారు.

రాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక జరిగింది. శనివారం ఉదయం స్నానం చేసేందుకు బాత్‌ రూమ్‌లో బకెట్‌లో హీటర్‌  పెట్టుకున్న ఆమె నీళ్లు వేడి అయ్యాయో లేదో చూసేందుకు కరెంట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా హీటర్‌ను బయటికి తీసింది. అదే సమయంలో హీటర్‌ ఆమెకు నడుముకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. బాత్‌రూమ్‌లో కిందపడి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

పెళ్లింట్లో విషాదం... 
బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో ఘనంగా పెళ్లి జరిపించగా పెళ్‌లైన నాలుగు రోజులకే వధువు మృతి చెందడంతో విషాదం నెలకొంది. మనీషా కుటుంబ సభ్యులు, ఆమె భర్త బోరున విలపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement