ప్రేమించి పెళ్లాడి... చిన్న గొడవతో

Wife And  Stir Husband Suicide Khammam - Sakshi

ప్రాణం తీసిన మనస్పర్థలు

సత్తుపల్లిటౌన్‌: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శీతానగరం గ్రామానికి చెందిన కుట్టడి సురేష్‌(26) పట్టణంలోని పాలవాడకు చెందిన కీర్తిలు డిగ్రీ చదువుకుంటూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నర వివాహం జరిగింది. ఇతను పట్టణంలోని గాంధీనగర్‌లో అద్దెకు ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే చుట్టుపక్కవారి మాటలతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కీర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమెను ప్రభుత్వాస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. బుధవారం ఉదయం ఆమెను తీసుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే సురేష్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. స్థానికుల సహకారంతో అతడిని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అయ్యో ‘పాపం’.. 
ఈ దంపతులకు ఐదు నెలల పాప ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని..ఆనందంగా కలిసి ఉందామని అందరినీ ఒప్పించి వేరుగా ఉంటున్నామని..ఇలా ఘోరం జరిగిందని..అయ్యో దేవుడా తనకు దిక్కెవరని మృతుడి భార్య కీర్తి బోరున విలపించడం పలువురిని కంటతడిపెట్టింది. ఆవేశంలో, మనస్తాపంతో యువకుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కలిచివేసింది. భార్య, చిన్నారి కోసం ఆలోచించి..బతికుండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top