అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. | Visakha Police Two Arrested In Assassination Case | Sakshi
Sakshi News home page

స్నేహితుడే కడతేర్చాడు.. 

Jul 23 2020 6:22 AM | Updated on Jul 23 2020 6:23 AM

Visakha Police Two Arrested In Assassination Case - Sakshi

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సీపీ రాజీవ్‌కుమార్‌ మీనా    

సాక్షి, విశాఖపట్నం: తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో.. ఆమెతో కలిసి స్నేహితుడినే కడతేర్చాడు ఓ యువకుడు. నాతయ్యపాలెం సమీపంలోని గ్లోబెక్స్‌ షాపింగ్‌మాల్‌ వెనుక కాలువలో ఈ నెల 13న కాలిపోయిన స్థితిలో లభించిన మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగరంలోని పోలీస్‌ కమిషనరేట్‌లో సీపీ రాజీవ్‌కుమార్‌ మీనా మీడియాకు బుధవారం వెల్లడించారు. మింది సమీప గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేష్‌, గుర్రాల జోగారావు స్నేహితులు. వీరిద్దరూ నిత్యం మద్యం సేవించి తిరుగుతూ వారం పదిరోజులకోసారి ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో మల్కాపురం ప్రాంతానికి చెందిన దీనా అలియాస్‌ స్వాతితో సన్నిహితంగా ఉంటున్న జోగారావు ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో గణేష్‌ పలుమార్లు స్వాతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎన్నిసార్లు చెప్పినా గణేష్‌లో మార్పు రాకపోవడంతో అడ్డు తొలగించుకోవాలని జోగారావు, స్వాతి నిర్ణయించారు.  

మద్యం తాగించి... కర్రతో దాడి చేసి  
గణేష్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్న జోగా రావు, స్వాతి ప్రణాళికలో భాగంగా జూలై 5న గాజువాక దరి గ్లోబెక్స్‌ షాపింగ్‌ మాల్‌ వెనుక్కు తీసుకొచ్చారు. అక్కడ మూతపడిన చేపల కంపెనీలో గణేష్‌కు మాయమాటలు చెప్పి కళ్లు, మద్యం తాగించారు. మత్తులోకి జారుకున్నాక గణేస్‌ తలపై జోగారావు కర్రతో దాడి చేయగా.., కింద పడిపోయాక మెడకు బెల్ట్‌తో బిగించి అంతమొందించారు. ఈ క్రమంలో గణేష్‌ కాళ్లు పట్టుకుని స్వాతి సహకరించింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉన్న కాలువలో పడేసి వెళ్లిపోయారు. మరో రెండు రోజుల తర్వాత సంఘటనా స్థలానికి వచ్చి చూడగా... మృతదేహం పాడవకపోవడంతో పెట్రోల్‌ పోసి కాల్చి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో మృదేహానికి ఉన్న కడియం, వాచీ కాలకపోవడంతో కేసులో అవే కీలకంగా మారాయి. 

పట్టించిన కడియం, వాచీ  
గ్లోబెక్స్‌ షాపింగ్‌ మాల్‌ వెనుక కాలువలో జూలై 13న కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభించిందని గుడివాడ అప్పన్న కాలనీ వీఆర్‌వో కార్తిక్‌ ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే మృతదేహం కాలిపోయి ఉండడంతో ఎవరనేది గుర్తించలేకపోయారు. 

ఆ సమీపంలో లభించిన వాచీ, కడియం, చెప్పులే కేసులో కీలకంగా మారడంతో వాటి ఆధారంగానే దర్యాప్తు సాగించారు. హత్య జరిగినట్లుగా నిర్ధారించిన తర్వాత డీసీపీ(క్రైం) సురేష్‌బాబు, సౌత్‌ ఏసీపీ ఆంజనేయులు రెడ్డి, ట్రైనీ డీఎస్పీ శిరీష, సీఐ సూరినాయుడు, ఎస్‌ఐలు గణేష్, సూర్యప్రకాష్, రమే‹Ùలు పలు బృందాలుగా విడిపోయారు. చివరకు మృతుడు గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేష్‌(38)గా గుర్తించి.., మరింత లోతుగా విచారించి జోగారావు, స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను పట్టుకున్న బృందాన్ని సీపీ ఆర్కేమీనా అభినందించారు. సమావేశంలో డీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ జీఆర్‌ రెడ్డి పాల్గొన్నారు.   


 

Advertisement
 
Advertisement
Advertisement