పట్టపగలే చొరబడ్డాడు!
కర్నూలు, నందవరం: ఓ దొంగ పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనం చేసి ఉడాయిస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన సోమవారం నందవరం మండలం గురజాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదనుగా తెలంగాణలోని గద్వాలకు చెందిన దొంగ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. రూ.1.30 లక్షల నగదు, 2 తులాల బంగారం దొంగలించాడు. అదే సమయంలో పొలం నుంచి వెంకటేష్ కుమారుడు అశోక్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంట్లో నుంచి దొంగ బయటకు రావడం చూసి అవాక్కయ్యాడు. గ్రామస్తులతో కలిసి వెంబడించి అతన్ని పట్టుకున్నారు. దొంగలించిన నగదు, బంగారు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.