ప్రభుత్వ ఆస్పత్రిలో టీ కొట్టు యజమాని వైద్యం

Tea Shop Owner is doctor in government hospital? - Sakshi

చెన్నూర్‌: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో లతీఫ్‌ అనే టీ హోటల్‌ యజమాని వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రోగులకు సెలైన్‌లు ఎక్కించాడు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నెల రోజులుగా చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. ఓ వైద్యుడు డిప్యూటేషన్‌పై వెళ్లాడు.

ఆరుగురు స్టాఫ్‌నర్సులకు గాను ఒకరు బదిలీ కాగా, మరొకరు డిప్యూటేషన్‌పై మరో ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నలుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు వార్డుబాయ్‌లు ఉన్నారు. వీరంతా మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి జ్వరంతో వచ్చిన బాలుడికి ఆస్పత్రి ఎదుట ఉండే టీ స్టాల్‌ యజమాని లతీఫ్‌ సెలైన్‌ ఎక్కించాడు. ఇతడికి అంబులెన్స్‌ ఉండడం, రోగులకు పాలు, టీలు సరఫరా చేస్తుండడంతో ఆస్పత్రి సిబ్బందితో సమానంగా వ్యవహరిస్తుంటాడు. వైద్య సిబ్బందితో ఉన్న చొరవ కారణంగా సెలైన్‌లు ఎక్కిస్తుంటాడని తెలిసింది. కాగా, ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సత్యనారాయణను సంప్రదించగా.. సిబ్బంది కొరత వాస్తవమేనని, లతీఫ్‌ సెలైన్‌ ఎక్కించలేదని, సెలైన్‌ బాటిళ్లు ఇవ్వడానికి బెడ్‌ వద్దకు వెళ్లాడని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top