ఒకే కుటుంబంలో నలుగురికి పాముకాటు    | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో నలుగురికి పాముకాటు   

Published Fri, Aug 3 2018 2:25 PM

Snake Bites To Four People - Sakshi

భూత్పూర్‌ (దేవరకద్ర) : ఇంట్లో రాత్రి నిద్రిస్తుండగా నిద్రలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పాము కాటుకు గురికాగా, చిన్నారి బాలుడు మృత్యువాతకు గురికాగా, మరో ముగ్గురికి ప్రాణపాయం తప్పిన సంఘటన మండలంలోని భట్టుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం భట్టుపల్లికి చెందిన వేముల సుదర్శన్‌రెడ్డికి భార్య వేముల సునీత, కుమారుడు మంజీత్‌ రెడ్డి, కుమార్తె మిన్నీ ఉన్నారు.

బుధవారం రాత్రి వారు ఇంట్లో పక్కపక్కనే నిద్రించారు. అర్ధరాత్రి వేముల సుదర్శన్‌రెడ్డికి చేతికి చల్లగా తగలడంతో నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. దీంతో అక్కడి నుంచి పాము వెళ్తుండడాన్ని చూసి చంపివేశాడు. ఆ తర్వాత చూసే సరికి కుమారుడు మంజీత్‌రెడ్డి(2) మత్తులోనే ఉండడంతో ఆయన పాము కాటు వేసిందని గుర్తించి చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే, గురువారం ఉదయం మంజీత్‌ అంత్యక్రియలు చేసేందుకు సమాయత్తమవుతుండగా.. సుదర్శన్‌రెడ్డితోపాటు ఆయన భార్య సునీత, కూతురు మిన్నీ కిందపడిపోయారు. దీంతో వీరిని కూడా పాము కాటు వేసిందని గుర్తించిన బంధువులు మహబూబ్‌నగర్‌లో ఎస్వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని సాయంత్రం ఇంటికి పంపించగా అశృనయనాల నడుమ కుమారుడు మంజీత్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. 

Advertisement
Advertisement