జలపాతంలో స్నానం చేస్తుండగా విషాదం
జమ్మూ : జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా దాదాపు 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలోని సియర్ బాబా జలపాతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రియాసి జిల్లాలోని సియర్ బాబా ఓ ఆధ్యాత్మిక ప్రదేశం కావటం వల్ల బాబా భక్తులు ఎక్కువగా అక్కడికి వస్తుంటారు. అక్కడ ఉన్న జలపాతంలో చిన్నాపెద్ద స్నానం చేస్తూ ఆనందంగా గడుపుతారు.
అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగి జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై పడ్డాయి. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 25 మంది గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, పోలీసులు గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.