వీడు సామాన్యుడు కాదు | Police Coombing For Double Murder Raja | Sakshi
Sakshi News home page

వీడు సామాన్యుడు కాదు

May 16 2018 9:20 AM | Updated on Jul 30 2018 9:21 PM

Police Coombing For Double Murder Raja - Sakshi

చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన నకిలీ నిందితులు, రాజా (ఫైల్‌)

చిత్తూరు అర్బన్‌: గుడిపాలలో జరిగిన జంట హత్యల కేసు చిక్కుముడి వీడింది. తమిళనాడుకు చెందిన అశోక్, గోపిలను హత్య చేసింది చెన్నైకు చెందిన స్టీరింగ్‌ రాజా (42)గా  తేలింది. కేసుతో తమకు సంబంధం లేకున్నా పోలీసులు వేధింపులకు గురిచేస్తుండటంతో తమకు రిమాండు విధించాలని రమేష్, శివ, కార్తిక్, సోమేష్, కులందయ్యలు సోమవారం చిత్తూరు కోర్టులో లొంగిపోవడానికి వచ్చి పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. వీళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ప్రధాన నిందితుడు రాజా అని అంగీకరించారు. కోర్టును తప్పుదారి పట్టించడం, దర్యాప్తు కోణాన్ని మార్చడానికి చూసినందుకు నిందితులు అయిదుగురిని రిమాండుకు తరలిం చినట్లు  సీఐ ఆదినారాయణ పేర్కొన్నారు.

హత్యలకు కారణం..
చెన్నైలోని తాంబరానికి చెందిన స్టీరింగ్‌ రాజాకు కుండ్రకొత్తూరుకు చెందిన గోపి, అశోక్‌కుమార్‌లకు పరిచాయాలున్నాయి. తిరువళ్లూరులోని బీఎ స్పీ పార్టీకి చెందిన తిమ్మరసు అనే వ్యక్తిని 2017లో స్టీరింగ్‌ రాజ, అశోక్‌కుమార్‌లు కలిసి హత్య చేశా రు. ఈ కేసులో వీరు కొద్ది రోజులు జైల్లో కూడా ఉన్నారు.  తన అన్నను హత్య చేసిన వాళ్లపై పగతీర్చుకోవడంలో భాగంగా తిమ్మరుసు తమ్ముడు బాంబురవి అనే వ్యక్తి స్టీరింగ్‌ రాజా గ్రూపునకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లాడు. ఇతనితో అశోక్‌కుమార్, గోపీలు సన్నిహితంగా ఉండటంతో వీళ్లిద్దరినీ హతమార్చాలని స్టీరింగ్‌ రాజా నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరినీ ఈనెల 10న కిడ్నాప్‌ చేసి గుడిపాలలోని పానాటూరు వద్ద హత్య చేశారు.

రాజాపై ఎన్నో కేసులు...
స్టీరింగ్‌ రాజ అలియాస్‌ నర్సింగ్‌ రాజా అలియాస్‌ రైజింగ్‌ రాజా పేరు చెబితే చెన్నైలోని తాంబరం ప్రాంతం వణికిపోతుంది. పేరుమోసి గ్యాంగ్‌స్టర్‌గా గుర్తింపు ఉంది. భూ తగాదాలను సెటిల్‌ చేయడం, కమీషన్లు తీసుకోవడం, అడ్డొచ్చినవాళ్లను హత్య చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఇతనిపై తమిళనాడులో 32 కేసులు ఉన్నాయి. తిరుపతి స్టేషన్‌లో సైతం ఓ కిడ్నాప్‌ కేసు ఉంది. చెన్నై పోలీసులు ఇతనిపై నాలుగుమార్లు పీడీ యాక్టులు పెట్టగా, ఒక్కసారి కూడా పట్టుకోలేకపోయారు. రూ.వంద కోట్లకు పైనే ఆస్తులున్న స్టీరింగ్‌ రాజా ఓ సామ్రాజ్యాన్నే నడుపుతూ గ్యాంగ్‌స్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇతన్ని పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం గాలింపు చేపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement