చేయి చాచి.. టోలుతీసి!
గుత్తి: టోల్ ప్లాజా వద్ద డ్యూటీలు చేస్తున్న కొందరు పోలీసులు అక్రమార్జనకు తెరలేపారు. పశువులు, భారీ లోడుతో వెళ్లే వాహనాలను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకు దండుకుంటున్నారు. గుత్తి టోల్ప్లాజా వద్ద రోజూ పెద్దవడుగూరుకు చెందిన ఇద్దరు పోలీసులు డ్యూటీలో ఉంటారు. వీరిలో కొందరు వాహన డ్రైవర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే.. కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. జిల్లా ఎస్పీ అశోక్కుమార్ ఎప్పటికప్పుడు చీడలను ఏరివేసే ప్రయత్నం చేస్తున్నా.. కొందరు పోలీసుల కారణంగా శాఖ పరువు బజారున పడుతోంది.
బలవంతంగా రూ.100 లాక్కున్నారు
మూడు రోజులుగా రెస్ట్ లేకుండా లారీ నడుపుతున్నా. అన్నం తినడానికి కూడా డబ్బు లేదు. ప్యాసింజర్లను ఎక్కించుకుంటే భారీగా ఫైన్ వేస్తున్నారు. నేను, క్లీనర్ టిఫిన్ చేయడానికి రూ.100 పెట్టుకున్నాం. గుత్తి టోల్ ప్లాజా వద్ద పోలీసులు లారీని ఆపి మా వద్దనున్న రూ.100 బలవంతంగా లాక్కున్నారు. – కర్ణాటక లారీ డ్రైవర్