న్యూస్‌ యాంకర్‌ దారుణ హత్య | Pak News Anchor Shot Dead In Karachi Cafe | Sakshi
Sakshi News home page

న్యూస్‌ యాంకర్‌ దారుణ హత్య

Jul 10 2019 10:41 AM | Updated on Jul 10 2019 10:48 AM

Pak News Anchor Shot Dead In Karachi Cafe - Sakshi

పోలీసులను చూసి భయాందోళనకు గురైన అతిఫ్‌ గన్నుతో కాల్చుకుని..

కరాచీ : వ్యక్తిగత తగాదాలకు ఓ న్యూస్‌ యాంకర్‌ బలయ్యాడు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరాచీకి చెందిన మురీద్‌ అబ్బాస్‌ అనే వ్యక్తి బోల్‌ న్యూస్‌ అనే ఛానల్‌లో పనిచేస్తున్నాడు. ఇతడికి అదేప్రాంతానికి చెందిన అతిఫ్‌ జమాన్‌తో వ్యక్తిగత తాగాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అబ్బాస్‌పై అతిఫ్‌ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అబ్బాస్‌ను చంపాలని నిశ్చయించుకున్నాడు. మంగళవారం సాయంత్రం ఖయాబన్‌-ఈ-బుఖారి ఏరియాలోని ఓ కేఫ్‌లో ఉన్న అబ్బాస్‌పై.. అబ్బాస్‌ స్నేహితుడు ఖైజర్‌ హయాత్‌పై అతిఫ్‌ గన్నుతో కాల్పులు జరిపి, అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడి వారు గాయపడిన స్నేహితులిద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఛాతి, పొట్టకింద బుల్లెట్లు దూసుకుపోయిన కారణంగా అబ్బాస్‌ చికిత్స పొందుతూ మరణించగా ఖైజర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.

అక్కడి సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా అతిఫ్‌ కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేయటానికి ఇంటికి వెళ్లారు. దీంతో పోలీసులను చూసి భయాందోళనకు గురైన అతిఫ్‌ గన్నుతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించటం గమనార్హం. దీనిపై ఐజీపీ(సింధ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌) ఖలీమ్‌ ఇమామ్‌ మాట్లాడుతూ.. హత్య జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని ఆధారాలు సేకరించటానికి ఫోరెన్సిక్‌ దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేసుకు సంబంధించిన నివేదిక అందజేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement