హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

MS Dhoni: Hero Sushant Singh Rajput Lifeless - Sakshi

సాక్షి, ముంబై :  బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారో కారణాలు తెలియరాలేదు. కాగా గత ఆరు నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.  ‘కోయ్‌ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్‌ ఆ తర్వాత ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి’, ‘ఎం.ఎస్‌.ధోనిః ద అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్‌కమ్‌ న్యూయార్క్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్‌’, ‘డ్రైవ్‌’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు.

అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘దిల్‌ బేచారా’. కాగా బాలీవుడ్‌లో లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న ప‌లువురు‌ టెక్నీషియ‌న్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.  మరోవైపు సుశాంత్‌ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్‌, టాలీవుడ్‌ చెందిన పలువురు ట్వీట్‌ చేశారు.

ఈ నెల 9న సుశాంత్‌ మేనేజర్‌ కూడా ఆత్మహత్య
కాగా ఆరు రోజుల క్రితం (9వ తేదీన) సుశాంత్ సింగ్ ద‌గ్గర మేనేజ‌ర్‌గా ప‌ని చేసిన దిశ స‌లియా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ముంబైలో త‌న ‌భ‌వ‌నంలోని 14వ అంత‌స్థు పైనుంచి దూకింది. తీవ్ర ర‌క్తస్రావ‌‌మైన ఆమెను వెంట‌నే బొరివ‌లిలోని ఆస్ప‌త్రికి త‌రలించగా.. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top