ఉరే సరి అని తేల్చినా.. | Minor girl gangraped, set on fire by two accused | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై ఘాతుకం

Dec 8 2017 2:57 PM | Updated on Oct 8 2018 3:19 PM

Minor girl gangraped, set on fire by two accused - Sakshi


సాక్షి, భోపాల్‌: మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధిస్తామని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా దెవాల్‌ గ్రామంలో ఎనిమిదవ తరగతి చదివే 15 ఏళ్ల బాలికపై ఆమె నివాసంలో ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఆమెకు నిప్పుంటించి పరారయ్యారు. బాధితురాలిని కాపాడిన ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బుందేల్‌ఖండ్‌ మెడికల్‌ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. బాధితురాలి శరీరానికి 80 శాతంపైగా కాలిన గాయాలయ్యాయని తెలిపారు. బాధితురాలిపై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర సేన్‌, శుభనం యాదవ్‌లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించిన నిందితులు గురువారం రాత్రి ఆమె నివాసంలోకి చొరబడి ఘాతుకానికి తెగబడ్డారని చెప్పారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement