పాల కోసం వెళుతూ మృత్యువు పాలు

Man Died In Bike Accident Visakhapatnam - Sakshi

పాలవ్యాను ఢీకొని యువకుని మృతి

రాయపురాజుపేటలో విషాదం

విశాఖపట్నం, చోడవరం జోన్‌ : పాలప్యాకెట్ల కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు దీంతో రాయపురాజు పేటలో విషాదం అలముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాయపురాజుపేటకు చెందిన ఆళ్ల నర్సింగరావు(27) శుక్రవారం ఉదయం పాల పేకెట్టు కోసం తన ద్విచక్రవాహనంపైన వెంకన్నపాలెం వెళ్తుండగా నర్సాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న విశాఖ డెయిరీ పాల లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో నర్సింగరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. తల్లి కాసులమ్మతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు.

ఎస్‌ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నర్సింగరావు తండ్రి గంగయ్య చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి కాసులమ్మ వ్యవసాయ కూలి చేస్తూ నర్సింగరావును, ఇద్దరు కుమార్తెలను పోషించింది. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. ప్రస్తుతం నర్సింగరావు అనకాపల్లిలోని ఒక ప్రయివేటు స్టీల్‌ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నర్సింగరావు మృతి చెందడంతో తల్లి కాసులమ్మ ఇక తనను పోషించేవారు ఎవరున్నారని తనకు తలకొరివి పెడతాడనుకున్న కొడుకు చనిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించింది. పండగపూట ప్రమాదం జరగడంతో రాయపురాజు పేటలో విషాదం అలము కుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top