‘మా నాన్నను ఎందుకు చంపారో తెలియదు’
ఢిల్లీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన తండ్రిని మావోయిస్టులు ఎందుకు చంపారో తెలియదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మావోయిస్టుల నుంచి తమకు ఎప్పుడు హెచ్చరికలు రాలేదని, నాన్న కూడా ఎప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సర్వేశ్వరరావు కుమారుడు నాని..దాడి గురించి తెలుసుకున్న వెంటనే విశాఖకు బయల్దేరారు.
ఆదివారం అరకు లోయలో కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం.