వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: కత్తి మహేశ్

kathi mahesh complaint about eggs attack on him - Sakshi

కోడిగుడ్ల దాడిపై మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: తనపై జరిగిన కోడిగుడ్ల దాడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటల ప్రాంతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్ కు వచ్చిన మహేశ్.. ఈ దాడి సినీ నటుడు పవన్ కల్యాణ్ ఫాన్స్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ఫాన్స్ నుంచి తనకు బెదిరింపు  కాల్స్ వస్తున్నాయని, కొందరు అభిమానులు తనను హెచ్చరిస్తున్నారని ఫిర్యాదులో  పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గురువారం రాత్రి ఓ మాదాపూర్‌లోని ఓ టీవీ చానెల్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబ్‌లో వెళ్తుండగా కొండాపూర్‌లో మహేశ్‌పై కోడి గుడ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు సిగ్నల్‌ దాటుతుండగా కోడిగుడ్లతో తనను కొట్టారని, ఇది కచ్చితంగా పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పనేనని మహేశ్ ఆరోపించారు. కుడి కన్నుపై కోడిగుడ్డు పడటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని చెప్పారు.  కొద్ది రోజులుగా అభిమానులను అదుపు చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.

దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన అనంతరం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. నాపై దాడి చేసిన వారిపై కేసు నమోదైంది. నిందితులు తాము తప్పు చేశామని అంగీకరించి, విచారం వ్యక్తం చేసే వరకు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని’ కత్తి మహేశ్ ట్వీట్ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top