హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకే..? | Inter Student Commit To suicide Attempt In Sri medha junior college | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Dec 15 2017 12:19 PM | Updated on Dec 15 2017 12:19 PM

Inter Student Commit To suicide Attempt In Sri medha junior college - Sakshi

నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌లోగల శ్రీ మేధా జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదు వుతున్న విద్యార్థిని రుచిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాల నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు, విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ప్రయివేటు ఆస్ప త్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న ఘటనా స్థలానికి వెళ్లి తోటి విద్యార్థులతో విచారణ చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యాయ త్నం చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది.

వినాయక్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌కు చెందిన రాజేశ్వర్‌ తన కూతురు రుచితను నగరంలోని శ్రీమేధ జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో చేర్చారు. విద్యార్థిని గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే వాకింగ్‌కు వచ్చిన వారంతా గుమిగూడారు. దీన్ని గమనించిన వైద్యులు ప్రేమానందం తన కారులో విద్యార్థినిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని రెండు కాళ్లు ఫ్రాక్చర్‌ అయినట్లు, మూడు పక్కటెముకులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. రక్త స్రావం అధికంగా కావడంతో విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న నాలుగో టౌన్‌ ఎస్‌ఐ నరేష్‌ విద్యార్థిని వాంగ్మూలం తీసుకునేందుకు జడ్జిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. విద్యార్థిని స్పృహలోకి రాకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఇంటర్‌ విద్యాధికారి ఒడ్డెన్న విచారణ చేపట్టారు.

సాయంత్రం ఆస్పత్రి వచ్చిన ఒడ్డెన్న విద్యార్థినిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యంతో ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లి తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రుచిత చదువులోనూ, ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండేదని వారు తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదని, ఆమె అలా ఎందుకు చేసుకుందో అర్థం కావడంలేదని సమాధానమిచ్చారు. ఇదేవిషయమై కళాశాల డైరెక్టర్‌ భూపతిరెడ్డిని అడగగా మూత్రశాలకు వెళ్లిన రుచిత కళాశాలపై నుంచి పడిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నానన్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. చదువు, ఫీజు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదన్నారు. నాలుగో టౌన్‌ పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకనే..?
ఇటీవలే విద్యార్థిని తనకు హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేదని తన తల్లితో చెప్పినట్లు సమాచారం. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులను అడిగే ప్రయత్నం చేయగా వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement