వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని భార్య హత్య

Husband Killed Wife In East Godavari - Sakshi

తూర్పుగోదావరి, జగ్గంపేట: వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఇంటికి రాకుండా ఆమె వద్దే ఉంటున్నాడని తెలుసుకున్న భార్య ఇదేమిటని ప్రశ్నించడమే ఆమె తప్పైంది. భార్య నిలదీయడాన్ని తప్పుగా భావించిన భర్త కర్కసుడై ఆమె ప్రాణాలు బలిగొన్న ఘటన జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాజమహేంద్రవరం సమీపంలోని శాటిలైట్‌ సిటీకి చెందిన కుడిపూడి కళావతి (35) సోమవారం మధ్యాహ్నం భర్త బాపిరాజు చేతిలో హత్యకు గురైంది. శాటిలైట్‌ సిటీలో నివాసం ఉండే బాపిరాజు, కళావతి దంపతులకు పాప, బాబు సంతానం. బాపిరాజు జగ్గంపేటలోని ఒక హోటల్లో వంట మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జగ్గంపేట పెట్రోల్‌ బంక్‌ వెనక వీధిలో అద్దెకు ఉండే ఓ మహిళతో అతడికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికిదారి తీసింది.

శాటిలైట్‌ సిటీలోని ఇంటికి ఎక్కువగా వెళ్లకుండా స్థానికంగా పరిచయమైన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భర్తపై అనుమానం వచ్చి విచారించిన కళావతికి నిజం తెలిసింది. సోమవారం ఉదయం ఆమె నేరుగా జగ్గంపేటలో భర్త అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి పరిశీలించింది. ఆ సమయంలో బాపిరాజు ఒంటరిగానే ఉన్నాడు. వివాహేతర సంబం«ధంపై బాపిరాజును ఆమె గట్టిగా నిలదీసింది. ఇరువురి మధ్య వా గ్వాదం చోటుచేసుకోవడంతో సహనం కోల్పోయిన బాపిరాజు భార్య మెడను గట్టిగా పట్టుకుని గొంతు పిసికి హత్య చేశాడు.  అనంతరం అతడు జగ్గంపేట పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. సీఐ కాశీవిశ్వనాథం, ఎస్సై అలీఖాన్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు తీసి చూడగా ముక్కు, నోటి నుంచి రక్త స్రావంతో కళా వతి మృతదేహం కనిపించింది. ఎస్సై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు. బాపిరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top