కిడ్నాప్‌ కథ సుఖాంతం | Happy ending to the kidnapping case | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కథ సుఖాంతం

Jul 31 2019 2:11 AM | Updated on Jul 31 2019 2:11 AM

Happy ending to the kidnapping case - Sakshi

నిందితుడు శేఖర్‌

హైదరాబాద్‌: యువతి కిడ్నాప్‌ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. వారం క్రితం కిడ్నాపునకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ సురక్షితంగా నగరానికి చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 23న రాత్రి యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నా ప్‌ కథ మంగళవారం ఉదయం సోనీ నగరానికి వచ్చిందని తెలి యడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా రు. ఇబ్రహీంపట్నం సమీపం లోని బొంగుళూరు గేటు వద్ద టీ స్టాల్‌ నడిపే ఎలిమినేటి యాదగిరి కూతురు సోనీ(22)కి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి 23న రవిశేఖర్‌ కారులో ఎక్కించుకుని హయత్‌నగర్‌ వరకు తీసుకొచ్చి రాత్రి 8:30 గంటల సమయంలో కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పటి నుంచి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితుడు వాడిన కారు నంబర్‌ నకిలీదని తెలిసి కంగుతిన్నారు. అతని ఆచూకీ కోసం ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఐదు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నా యి. 3 రోజులు గడిచినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యు ల్లో ఆందోళన పెరిగింది. చివరకు నిందితుడిని రవిశేఖర్‌గా గుర్తించిన పోలీసులు అతను ఆ కారును బళ్లారి నుంచి దొంగిలించినట్లుగా కనుగొన్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడు చిక్కకపోవడంతో పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం సోనీ నగరానికి చేరుకుంది.

మీడియా కంట పడకుండా...
ఎంజీబీఎస్‌లో బస్సు దిగిన వెంటనే సోనీ తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా వారు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. వారు సోనీ ని సరూర్‌నగర్‌ మహిళా పోలీస్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. మంగళవారం మొత్తం సోనీ మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. నిందితుడు రవిశేఖర్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా అధికారులు ధృవీకరించడంలేదు. ఈ కిడ్నాప్‌ ఘటనపై  రాచకొండ పోలీసులు సోనీని, రవిశేఖర్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది.  వైద్య పరీక్షల నిమిత్తం సోనీని వైద్య పరీక్షల నిమిత్తం పేట్ల బురుజులోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించి నట్లు సమాచారం. నిందితుడు బళ్లారిలో దొంగిలించిన కారుకు ఉన్న జీపీఆర్‌ఎస్‌తో పోలీసులు కారు కదలికలను కనుగొన్నారు. కర్నూలు, తిరుపతిలో అతని కదలికలు గుర్తించారు. చివరికి అద్దంకి, ఒంగోలులో పట్టుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement