ఇష్టం లేని పెళ్లి చేశారని యువకుడి ఆత్మహత్య

Groom Commits Suicide in Anantapur - Sakshi

అనంతపురం,కణేకల్లు: ఇష్టం లేని అమ్మాయితో పెళ్లి చేయడంతో మనోవేధనకు గురైన నవ వరుడు గొల్ల మంజునాథ (28) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కణేకల్లులో చోటు చేసుకొంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ... కణేకల్లులోని ముల్లావీధిలో నివాసముంటున్న గొల్ల మంజునాథ (28) టైలరింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు గత నెల 10వ తేదిన తాడిపత్రి మండలం గంగదేవరపల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం చేశారు.

పెళ్లి నిశ్చయం నుండి ఈమెతో పెళ్లి వద్దని పలుమార్లు కుటుంబ సభ్యులతో మొరపెట్టుకొన్నాడు. అయినప్పటికీ అతని మాటను ఎవరూ లెక్క చేయకుండా నవంబర్‌ 10న పెళ్లి చేశారు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన మంజునాథ మంగళవారం ఉదయం కణేకల్లు శివారులోని హెచ్చెల్సీ అక్విడెక్ట్‌ వద్ద పురగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top