కిడ్నాప్‌ చేసి.. సామూహిక అఘాయిత్యం

Gang Rape On Woman In Karnataka - Sakshi

శ్రీరంగపట్టణ వద్ద ఘోరం

పరారీలో దుండగులు

మండ్య: దేవాలయానికి వెళ్లిన మహిళను అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘోరం మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీరంగ పట్టణం సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన మహిళ ఈ నెల 4వ తేదీన సమీపంలో ఉన్న కరిఘట్ట దేవాలయానికి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన సంజయ్, బిడ్డా, రమేష్‌ ముగ్గురు కలిసి మహిళను కారులో ఎత్తుకెళ్తారు. సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకోని వెళ్ళి  అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెబితే అందరికీ చిత్రాలు పంపిస్తామని, తాము పిలిచినప్పుడల్లా వచ్చి కోరిక తీర్చాలని హెచ్చరించారు.

దాంతో బాధిత మహిళ వారి వేధింపులను తట్టుకోలేక బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపింది. దీంతో వారు బాధితురాలితో కలిసి శ్రీరంగ పట్టణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు నిందితులపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. పాతకక్షల కారణంగానే మహిళ పైన ఈ ముగ్గురు ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top