నీట మునిగి నలుగురు పిల్లలు మృతి | Four children drown in water | Sakshi
Sakshi News home page

నీట మునిగి నలుగురు పిల్లలు మృతి

Nov 16 2017 1:33 AM | Updated on Feb 8 2025 12:09 PM

వరంగల్‌: నీటికుంటలో పడి నలుగురు విద్యార్థులు మృతి చెందిన దుర్ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వరంగల్‌ మండలం కొత్తపేటలోని ఈదులకుంటలో ఈతకు వెళ్లి నలుగురు మృ త్యువాతపడ్డారు. వరంగల్‌ సుందరయ్యనగర్‌కు చెందిన ముస్లిం కుటుంబాలు ప్రతి ఏడాది ఆఖ్‌రీ చార్‌షాంబ (ఆఖరి బుధవారం) నాడు వంటలకు వెళ్తారు. ఆ ఆనవాయితీ ప్రకారం కొన్ని ముస్లిం కుటుంబాలు కొత్తపేట సమీపంలోని తాటివనానికి వనభోజనాలకు వెళాయి. భోజనాలు చేశాక  ఎండి.రంజాన్‌(16), ఎండి.నదీంపాషా(16), ఎండి.రసూల్‌(13), ఎండి.యాకుబ్‌పాషా(13) నలుగురు పిల్లలు ఈదులకుంటలో స్నానాలు చేసేందుకు వెళ్లారు.  

ఇద్దరిని కాపాడబోయి.. మరో ఇద్దరు.. 
తొలుత నదీంపాషా, రంజాన్‌లు నీటిలో లోతున్న ప్రాంతానికి వెళ్లారు. వారు నీటిలో మునిగిపోతుండటం చూసి ఒడ్డు పైనున్న రసూల్, యాకుబ్‌పాషాలు చేయందించి, బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న యాకుబ్‌పాషా తమ్ముడు ఎండి.రహేల్‌ పెద్దలకు ఈ విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకునేప్పటికే పిల్లలు నీటిలో మునిగిపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. రంజాన్, నదీంలు  పదో తరగతి చదువుతుండగా, రసూల్, యాకుబ్‌పాషా ఎనిమిదో తరగతి చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ, పరకాల ఏసీపీ సుధీంద్రలు సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement