మాజీ ఎమ్మెల్యే పొట్నూరు మృతి | Former MLA Potnuru Died | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే పొట్నూరు మృతి

Aug 16 2018 11:32 AM | Updated on Aug 16 2018 11:32 AM

Former MLA Potnuru Died  - Sakshi

 పొట్నూరు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు, మజ్జి శ్రీనువాసరావు 

గుర్ల విజయనగరం : మాజీ శాసనసభ్యుడు పొట్నూరు సూర్యనారాయణ(76) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన విశాఖలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో పది రోజుల కిందట చికిత్స నిమిత్తం చేరి బుధవారం మరణించారు. కడుపునొప్పి తీవ్రంగా రావడంతో బీపీ తగ్గి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య పొట్నూరు కనకమ్మ, కుమారుడు సన్యాసినాయుడు, కుమార్తెలు వరహలమ్మ, ఆదెమ్మ, జ్యోతి ఉన్నారు. వరహలమ్మ ఇటీవలె మరణించడంతో అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 

ప్రముఖల నివాళి

పొట్నూరు సూర్యనారాయణ పార్ధీవ దేహన్ని వైఎస్సార్‌ సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనువాసరావు, పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామి నాయుడు, కొండపల్లి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బోత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, భంజదేవ్,  టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శిరువురి వెంకటరమణరాజు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ చనమల్లు వెంకటరమణతో పలు మండలాలకు చెందిన ఆయన అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అంత్యక్రియలలో పాల్గొన్న మజ్జి  

పొట్నూరు సూర్యనారాయణ అంత్యక్రియలకు వైఎస్సార్‌ సీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనువాసరావు పాల్గొని పూర్తయ్యే వరకు ఉన్నారు. అంత్యక్రియల్లో పొట్నూరు పార్ధీవ దేహం వెంట నడిచారు.  శ్మశాన వాటికలోని పొట్నూరు పార్ధీవ దేహనికి వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఆనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.  

సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే వరకు...

పొట్నూరు సూర్యనారాయణ వ్యవసాయ కూలీ అయిన పొట్నూరు సన్యాసినాయుడు, ఆదెమ్మలకు 1942లో జన్మించాడు. అంచలంచెలుగా ఎదిగి 1962 గూడేం సోసైటీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం పాలవలస గ్రామ సర్పంచ్‌గా 22 ఏళ్లు పాటు కొనసాగారు.  1989లో మొదటిసారిగా సతివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఆయనను  పోటికి దించింది. ఆ ఎన్నికల్లో  ప్రత్యర్ధి పెనుమత్స సాంబశివరాజు చేతిలో ఓడిపోయారు.

1994, 1999, 2004 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 1994లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. అనంతరం రాజకీయ సమీకరణాలు మారడంతో ఆయన బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement