తండ్రీకొడుకుల ‘బియ్యం’ దందా | Father And Son Arrest in Ration Rice Smuggling Case | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకుల ‘బియ్యం’ దందా

Sep 7 2018 9:03 AM | Updated on Sep 7 2018 9:03 AM

Father And Son Arrest in Ration Rice Smuggling Case - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు చేస్తున్న రేషన్‌బియ్యం దందాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. సివిల్‌ సప్‌లై అధికారులతో కలిసి చేసిన దాడుల్లో ఇద్దరిని పట్టుకుని,  ఆరు క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం తెలిపారు. భోలక్‌పూర్‌కు చెందిన తండ్రీకుమారులు అహ్మద్‌ అలీ, సర్ఫరాజ్‌ అలీ తోలు వ్యాపారం చేసేవారు. ఇందులో నష్టం రావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం బియ్యం దందా ప్రారంభించారు. ముషీరాబాద్, భోలక్‌పూర్, గాంధీనగర్, వారాసిగూడ ప్రాంతాలకు చెందిన వినియోగదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని కేజీ రూ.8 చొప్పున ఖరీదు చేసే వారు. వీటిని గూడ్స్‌ ఆటోలో జహీరాబాద్‌కు తరలించి అక్కడ కేజీ రూ.15కు విక్రయిస్తూ సొమ్ము చేసుకునే వారు. దీనిపై సమాచారం అందడంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం సివిల్‌ సప్‌ లై అధికారులతో కలిసి శుక్రవారం వీరి గోదాంపై దాడి చేసింది. ఆరు క్వింటాళ్ల బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకుంది. కేసును తదుపరి చర్యల నిమిత్తం గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించింది. 

గుట్కా రాకెట్‌ గుట్టు రట్టు
ముషీరాబాద్‌లోని అంబిక స్టోర్స్‌పై దాడి చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నిషేధించడంతో ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడంతో గాంధీనగర్, నాంపల్లి, టోలిచౌకి, ముషీరాబాద్‌ ప్రాంతాలకు చెందిన డి.మోహన్‌కుమార్, ఎండీ సాహుల్, మహ్మద్‌ ఫారూఖ్, ఎం.మహేష్, బి.శ్రీధర్, ఎండీ ఖాలీద్‌ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. తనకు చెందిన అంబిక స్టోర్స్‌ ద్వారా మోహన్‌ భారీగా గుట్కా విక్రయా లు చేస్తున్నాడు. దీనికి మహేష్, శ్రీధర్‌ సహకరిస్తున్నారు. వీటిని సాహిల్‌ హోల్‌సేల్‌గా ఫారూఖ్‌కు చెందిన ఆటోలో సరఫరా చేస్తున్నాడు. ఖాలీద్‌ తదితరుల పొగాకు ఉత్పత్తులు సరఫరా చేసేవారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువా రం దాడి చేసి ఖాలిద్‌ మినహా ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు లక్షల విలువైన గుట్కా , పొగాకు ఉత్పత్తులతో పాటు రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం ముషీరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement