రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి

Published Sat, Sep 21 2019 1:19 PM

Father And Daughter Died in Bike Accident Krishna - Sakshi

బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబర్‌ జాతీయ  రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది.

ఇబ్రహీంపట్నం (మైలవరం) : బైకును లారీ డీకొన్న ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించే నిమిత్తం విస్సన్నపేట వెళ్లి తిరిగి వస్తూ తండ్రీ, కూతురు అసువులు బాయటం ఆ కుటుంబాన్ని కలచివేసింది. సేకరించిన వివరాల మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరావు (30) పూల వ్యాపారం చేస్తాడు. ఇటీవల కాలంలో తన పదేళ్ల కుమార్తెకు చేయి విరగటంతో విసన్నపేటలో నాటువైద్యం చేయించేందుకు తన బైకుపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ మీదుగా వస్తుండగా ఇబ్రహీంపట్నం వద్దకు చేరుకునే సమయానికి వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన లారీ వీరి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు.  తీవ్రరక్తస్రావానికి గురైన కుమార్తె తిరపతమ్మ (10)ను ట్రాఫిక్‌ పోలీసులు తమ పెట్రోలింగ్‌ వాహనంలో వైద్యశాలకు తరలించారు. గొల్లపూడి ఆంధ్రా వైద్యశాలలో చికిత్స పొందుతూ బాలిక కూడా మరణించినంది. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement